Telangana: కాంగ్రెస్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గుబులు

Telangana: వరుస ఎన్నికల ఓటమితో కృంగిపోతున్న హస్తం పార్టీ * పెద్ద సవాల్‌గా మరిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

Sandeep Eggoju
Published on: 6 March 2021 6:38 AM IST
Graduate MLC Elections Fear To Telangana Congress
X

Representational Image

Telangana: టి కాంగ్రెస్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గుబులు పట్టుకుందా ? వరుస ఎన్నికల ఓటమితో కృంగిపోతున్న హస్తం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద సవాల్‌గా మారనున్నాయా? ఎన్నికల్లో గెలుపు అటుంచితే.. కాంగ్రెస్ పార్టీ పరువు కోసం పాకులాడుతుందా ? ఎన్నికల్లో గెలవకున్నా కనీసం రెండో స్థానంలో నిలవడానికి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు భయం పట్టుకుంది పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది?

కాంగ్రెస్ పార్టీకి గతం ఘనంగా ఉన్నా ఇప్పుడు అది అంత గతం అనే విధంగానే ఉంది. మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పూర్వ వైభవం వస్తుందని ఏ నేతల్లో కూడా నమ్మకం కనిపించడం లేదు. గతలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ గెలుపు లేదంటే స్వల్ప తేడాలో ఓడిపోయేది. ప్రత్యర్ధి పార్టీలకు ముచ్చెమటలు పట్టించే విధంగా హస్తం పార్టీ ఉండేది.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

రాష్ట్రం ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నా ఇప్పుడు అదే రాష్ట్రంలో పార్టీ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో మాత్రమే గెలుచుకుంది. అది కూడా రేవంత్ ఒక్కడే పట్టుబట్టి సాధించుకున్నాడు. చాలా చోట్ల థర్డ్ ప్లేస్‌కి పోయింది.

అయితే ఆ ఎన్నికలు ముగిశాయి అనుకునేలోపే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్‌కు శాపంగా మారాయి. ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుండి రాములు నాయక్ ను హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుండి చిన్నారెడ్డిని ప్రకటించారు. ఇక కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో హర్షవర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు. చిన్నారెడ్డి తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.. రాములు నాయక్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ప్రచారం చేస్తున్నారు.మిగుతా నాయకులు పెద్దగా ఎక్కడ కన్పించడంలేదనే వాదన హస్తం పార్టీ లో ఉంది.

ఉద్యోగులకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బలమైన వాదాన్ని తీసుకవెళ్లలేకపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు నాగార్జున సాగర్ లో అనుకూలంగా కాంగ్రెస్ ఉందని భావిస్తున్నారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చే ఎన్నికలపై పడుతుందని నేతల్లో భయం పట్టుకుందనే చర్చ గాంధీ భవన్ లో వినిపిస్తుంది.

గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, నాగార్జున సాగర్ ఫలితాల తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏమి కాబోతుందో క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి అగ్నిపరీక్ష లాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండనుందననే అంశం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story