కష్టాల్లో కొమురం భీమ్‌ వారసులు.. వీరుల కష్టం తీరేదెప్పుడు..?

కష్టాల్లో కొమురం భీమ్‌ వారసులు.. వీరుల కష్టం తీరేదెప్పుడు..?
x
Highlights

తెలంగాణా సాయుధ పోరాట యోధుడు కొమురం భీమ్ వారసులు కష్టాల కొలిమిలో ఉన్నారు.

జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం సైన్యానికి వణుకు పుట్డించిన యోధుడు కొమురం భీమ్‌ వారసులు కష్టాల కొలిమిలో చిక్కుకున్నారు. నిజాం పాలనను తరిమికొట్టిన ఆ 12 గ్రామాల పోరాట యోధులు సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కొమురం భీమ్ ఆధ్వర్యంలో హక్కులను సాధించిన అడవి బిడ్డల బతుకుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కూడా ఎలాంటి మార్పూలేదు.. కోమురం భీమ్‌ వర్థంతి సందర్భంగా నైనా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకుంటుందేమోనని గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.

కొమురం భీమ్‌ పురిటిగడ్డ అయిన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి అతిసమీపాన ఉన్న రౌటసంకెపెళ్లి అనే గ్రామం నేటికీ సమస్యలతో సతమతమవుతూనే ఉంది. జోడేఘాట్ లోని చుట్టుపక్కల గ్రామాలైన కలాం గూడా, పాట్నాపూర్, పెద్ద పాట్నాపూర్, శివగూడ, బాబేఝరీ, మహారాజ్ గూడా, పాటగుడా, చాల్బాడీ, టోకెన్మోవాడ్, గ్రామాలలో రోడ్డు, మురికి కాలువలు, వైద్యం, విద్యలాంటి అనేక కనీస సౌకర్యాలు కూడాలేవు. ఎప్పుడు కూలిపోతాయో తెలియని మట్టిఇళ్లు, వెదురు బొంగులగుడిసెలు, గూణ పెంకుల ఇళ్లలో అలుపెరుగని వీరుల వారసులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్న దయనీయ పరిస్థితులే కనిపిస్తాయి.

ఆనాటి నుంచి నేటి వరకూ ప్రభుత్వాలు మారినా.. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా తమ తలరాతలు మాత్రం మారలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 అక్టోబర్ 8న సీఎం కేసీఆర్ జోడేఘాట్ లోని భీమ్ మ్యూజియంలో నిర్వహించిన గిరిజన దర్బార్ కు హాజరయ్యారు. ఆ సమయంలో ఆదివాసీల కష్టాలను అర్థం చేసుకుని కొమురం భీమ్ మనుమరాలు సోంబాయితో పాటు జోడేఘాట్ లోని 50 గిరిజన కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అది కేవలం హామీగా మాత్రమే మిగిలిపోయింది.

ముఖ్యమంత్రి హామీతో పక్కా ఇళ్లు వస్తాయని భావించిన గిరిజనులకు ఇప్పటికీ నిరాశే మిగిలింది. జోడేఘాట్ లోని నేటికీ ఒక్కటంటే ఒక్క పక్కా గృహం కూడా ప్రభుత్వం నిర్మించలేదు. దీంతో కొమురంభీం వారసులకు గుడిసెలు, గూణ పెంకుల ఇళ్లే దిక్కయ్యాయి. నిజాం సేనలపై పోరాడిన 12 గ్రామాల్లో రోడ్ల పరిస్థితి మరింత దయనీయం.. చిన్న వర్షానికే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. దీంతో ఆదివాసీల కష్టాలు కన్నీళ్లను తెప్పించక మానవు.

ప్రతి ఏటా కొమురంభీం వర్ధంతికి నాయకులు అధికారులు రావడం రాష్ట్ర మంత్రులు హామీలు ఇచ్చి పోవడమే తప్ప ఇచ్చినటువంటి హామీలో ఒకటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదని ఆదివాసీలు వాపోతున్నారు. ఇప్పుడు వచ్చే భీం వర్ధంతికైనా డబుల్ బెడ్ రూమ్ ఇంళ్లు కట్టించి ఇస్తారా అని అమాయక ఆదివాసీ ప్రజలు ఎదురు చూస్తున్నారు.





Attachments area

Preview YouTube video కష్టాల్లో కొమురం భీమ్ వారసులు | Telangana | hmtv

Show Full Article
Print Article
Next Story
More Stories