CM KCR praised two teachers for promoting plantation : ఇద్దరు అధ్యాపకులకు సీఎం ప్రశంసలు

Arun Chilukuri
Published on: 17 July 2020 9:32 AM IST
CM KCR praised two teachers for promoting plantation : ఇద్దరు అధ్యాపకులకు సీఎం ప్రశంసలు
X

CM KCR praised two teachers for promoting plantation : కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఇద్దరు అధ్యాపకుల ప్రస్తావన వచ్చింది. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం లాంటి సామాజిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి సీఎంకు చెప్పారు. ఇద్దరు తమ విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని చెప్పారు. వారిద్దరినీ ప్రోత్సహించాలని, ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, అక్కడ తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన సదాశివయ్యతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. హృదయ పూర్వకంగా అభినందించారు. మీలాంటి వాళ్లే సమాజానికి కావాలి. ఈ స్పూర్తిని కొనసాగించండి. పాలమూరు యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు పెంచండి. మంచి ఉద్దేశ్యంతో చేస్తున్న మీ సామాజిక కార్యక్రమాలను కొనసాగించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని సిఎం కేసీఆర్ సదాశివయ్యతో అన్నారు. బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story