Telangana: భాగ్యనగరంలో ఒక్కరోజే కరోనాకు 115 మంది బలి..?

Telangana: 115 dead in TIMS, Gandhi Hospital
x

Telangana: భాగ్యనగరంలో ఒక్కరోజే కరోనాకు 115 మంది బలి..?

Highlights

Telangana: కరోనా సెకండ్ వేవ్ భాగ్యనగరంలో విలయతాండవం చేస్తోంది. భారీగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.

Telangana: కరోనా సెకండ్ వేవ్ భాగ్యనగరంలో విలయతాండవం చేస్తోంది. భారీగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గాంధీ, టిమ్స్‌ ఆస్పత్రుల్లో ఒక్కరోజులోనే 115 మంది కరోనాకు బలయ్యారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు గాంధీ ఆస్పత్రిలో 75 మంది, గచ్చిబౌలిలోని టిమ్స్‌‌లో 40 మంది కరోనాతో మృతి చెందినట్లు సమాచారం. గాంధీలో గడిచిన మూడు రోజుల్లో 205 మంది మహమ్మారికి బలైనట్లు, శుక్రవారం 62 మంది, శనివారం 68, ఆదివారం 75 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రోజూ సుమారు 40 నుంచి 75 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నట్లు సమాచారం.

కరోనా బారినపడిన వారంతా పరిస్థితి విషమించాక గాంధీ హాస్పిటల్‌కు వస్తునట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వారిని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, అప్పటికే పరిస్థితి చేయిదాటి పోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోందంటున్నారు. మృతుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స పొందుతున్న వారు ఎక్కువగా ఉంటున్నట్లు చెబుతున్నారు. గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌, మందులు, బెడ్ల కొరత లేనప్పటికీ సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా మారిందంటున్నారు. దీంతో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఆదివారం ఒక్కరోజే టిమ్స్‌లో 40 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఆస్పత్రిలో గత మూడు రోజుల నుంచి రోజుకు 30 నుంచి 35 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం టిమ్స్‌లో 600 మంది కరోనా రోగులు ఉండగా, వీరిలో 100 మంది ఐసీయూలో వెంటిలేషన్‌పై చికిత్స పొందుతున్నారు. మిగతావారు స్వల్ప ఆక్సిజన్‌తో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో సిబ్బందిపై పనిబారం పెరుగుతున్నట్లు, ఇప్పటికే పలువురు నర్సులు, వైద్యులు కరోనా బారిన పడి ఇక్కడే చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

కరోనా రోగులను గాంధీకి తీసుకువస్తుండటంతో ఆస్పత్రి ప్రాంగణంలో అంబులెన్స్‌లు క్యూ కడుతున్నాయి. కరోనా రోగి వివరాలు నమోదు చేసుకునే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గంటల తరబడి ఆలస్యం కావటంతో చివరి స్టేజీలో ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. కొంతమంది ఆక్సిజన్‌ అందకపోవడంతో అంబులెన్స్‌లోనే కన్నుమూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories