Bheemuni Paadam Waterfalls : కనువిందు చేస్తున్న జలధార

Arun Chilukuri
Published on: 20 July 2020 11:42 AM IST
Bheemuni Paadam Waterfalls : కనువిందు చేస్తున్న జలధార
X

Bheemuni Paadam Waterfalls : జల తరంగాల పరుగులు జల సవ్వడుల సంగీతం. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు కలగలిసిన అద్భుత దృశ్యమాలిక భీమినిపాదం. ప్రకృతి అందాలే కాదు ప్రాచీన చరిత్ర కూడా ఈ ప్రాంతానికి సొంతం. ఈ అందాల వీక్షణకు వచ్చినవారంతా తన్వీతీర వీక్షించి, మనస్ఫూర్తిగా తృప్తి చెందుతారు. కానీ ఈ పర్యాటక ప్రాంతం అంతగా ప్రాచుర్యంలోకి రాలేకపోయింది. సరైన సౌకర్యాలు లేక భీమునిపాదం ప్రకృతి ప్రేమికులను నిరుత్సాహ పరుస్తోంది.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారులోని భీమునిపాదం జలపాతానికి ప్రాచీన చరిత్ర ఉంది. పాండవుల అరణ్యవాసం చేసే కాలంలో భీముడు ఈ ప్రదేశంలో కాలు మోపడని ప్రసిద్ధి అందుకే ఈ ప్రాంతానికి భీమునిపాదం అనే పేరు వచ్చింది. భీముని అడుగు పడిన ప్రదేశం నుంచే నీటి జాలు కిందకు పడుతోంది. అదే భీమునిపాదం జలపాతం.

వేగంగా ఎగిసిపడుతున్న ఈ జలధారను చూస్తే ఏ వాగు నుంచో, ఏ నది నుంచో నీళ్లు వస్తున్నాయనుకుంటారు. కానీ విశేషమేమిటంటే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. కరువు విలయతాండవం చేసినా ఈ జలపాతం ఆగిపోదు. నిరంతరం నీటి జాలు వస్తూనే ఉంటుంది. ఈ జలపాతం నుంచి ఎగిసిపడే నీరు కుంటలు, చెరువుల్లోకి చేరుతుంది. అక్కడి నుంచి పంట పొలాలు నీరు చేరుతుంది.

భీమునిపాదం నిరంతరం అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. కాలంతో సంబంధం లేకుండా ప్రకృతి అందాలను ప్రదర్శిస్తుంది. ఇక్కడి విశాలమైన స్థలం ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తుంది. సుదూర ప్రదేశాల నుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడి అందాలను వీక్షిస్తారు. అలాగే ఇక్కడే కొలువైన సీతారాముల విగ్రహాలకు పూజలు చేస్తారు. దట్టమైన అడవి, పైగా అక్కడకు వెళ్దామంటే సరైన రోడ్డు మార్గం కూడా లేదు. దీంతో పర్యటకులు భీమునిపాదం చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తే భీముని పాదం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడం ఖా‍యం.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story