Haritha Haram Program: హైదరాబాద్ లో నేటి నుండి హరితహారం

Arun Chilukuri
Updated on: 25 Jun 2020 10:46 AM IST
Haritha Haram Program: హైదరాబాద్ లో నేటి నుండి హరితహారం
X

తెలంగాణ వ్యాప్తంగా నేడు ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఈ కార్యక్రమం చేపట్టేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చకాచకా పూర్తి అయ్యాయి. ఇందుకోసం మేయర్ బొంతు రామ్మోహన్, అర్బన్ బయోడైవర్సిటీ అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేంచారు.

తెలంగాణ రాష్ట్రంలో నేడు ఆరోవిడత హరితహారం కార్యక్రమం మొదలుకానుంది. కాంక్రీటు జంగల్ గా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో మొక్కలు నాటేందుకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచారు. హైదరాబాద్ ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ ఎంసీ పరిధిలో ఈ సంవత్సరం 2 కోట్ల 50 లక్షలు మొక్కలు నాటాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా లక్ష్యాలను సాధించేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం 150 వార్డులలో వార్డు స్థాయి హరిత ప్రణాళికను రూపొందించారు అధికారులు.

హరితహారం కార్యక్రమంలో కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్లు కీలకపాత్ర పోషించాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ లు, సంక్షేమ సంఘాలను భాగస్వాములను చేయనున్నారు. ప్రతి కుటుంబాన్ని హరితహారంలో భాగస్వాములను చేసి ప్రతి ఇంటి ఆవరణ, ఇండ్లలో పెంచుకునేoదుకు అనువైన మొక్కలు అందించనున్నారు.

హరితహారంలో భాగంగా 50 థీమ్ పార్కులు అభివృద్ధి చేసి దట్టమైన అడవుల ఏర్పాటుకు 75 చోట్ల యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేపడుతున్నారు అధికారులు. అలాగే 700 ట్రీ పార్కులను అభివృద్ధి చేసేందుకు జీహెచ్ ఎంసీ పరిధిలోని 29 నర్సరీలలో 50 లక్షలు మొక్కలు సిద్ధంగా ఉంచారు. మరో 2 కోట్ల మొక్కలను హెచ్ ఎం డి ఎ నర్సరీలు, ప్రవేటు నర్సరీల నుండి సేకరించనున్నట్లు మేయర్ చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను హరిత నగరంగా చేసేందుకు నగరవాసులు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారాయన. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ గ్రేటర్ లో హరితహారం కార్యక్రమం పూర్తి చేయాలని ప్రణాళిక రచించారు జీహెచ్ ఎంసీ అధికారులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story