Covid Guidelines: కోవిడ్‌ నిబంధనలు పాటించని విద్యాసంస్థలు

Covid Guidelines: లాక్‌డౌన్‌ సమయంలో మూతబడ్డ విద్యాసంస్థలపై పూర్తిస్థాయి ఆంక్షలను తొలగించి..

Arun Chilukuri
Published on: 25 Oct 2021 5:57 PM IST
ఫైల్ ఇమేజ్
X

ఫైల్ ఇమేజ్ 

Covid Guidelines: లాక్‌డౌన్‌ సమయంలో మూతబడ్డ విద్యాసంస్థలపై పూర్తిస్థాయి ఆంక్షలను తొలగించి ఆఫ్‌లైన్ విద్యాభ్యాసానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే, కోవిడ్ నిబంధనలు తప్పని సరి పాటించాలని షరతులు పెట్టింది. కానీ విద్యాలయాలు ఆ సూచనలు లైట్ తీసుకున్నాయి.

హైదరాబాద్ జిల్లాలో 689 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుండగా వాటిలో 1.10 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ స్కూళ్లలో 90 శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. అలాగే, ప్రైవేటు స్కూళ్లు 1875 ఉండగా వాటిలో 7.39 లక్షల మంది విద్యార్ధులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఐతే, విద్యా సంస్థలు కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రులు చిన్నారులను భయంగా బడులకు పంపిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించకుంటే వైరస్ ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం 50 నుంచి 60 వరకు పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. మరోపక్క డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులు ప్రజలపై విరుచుకు పడుతున్నాయి. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఒక బెంచీలో ముగ్గురి కంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టి, బౌతికదూరం పాటించడం లేదని అలాగే జలుబు, దగ్గు లక్షణాలున్నవారిని కూడా గుర్తించడం లేదని విద్యార్థులంటున్నారు.

ఇటు ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్ధులు మాస్క్‌లు ధరించకుంటే పెట్టుకోవాలని వారించడం మాట అలా ఉంచి స్వయాన టీచర్లే మాస్క్‌లు పెట్టుకోవడం లేదని విద్యార్ధులు అంటున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం వేళ గుంపుగుంపులుగా కూచోని ఒకేచోట తినాల్సి వస్తుందని అంటున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కోవిడ్ నిబంధనలు పాటించని పాఠశాలలను తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story