TSRTC: సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ

Sankranti Special Buses From Today
x

TSRTC: సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ

Highlights

TSRTC: సాధారణ ఛార్జీలతోనే సంక్రాంతి బస్సులు

TSRTC: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగ సంక్రాంతి. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు పండుగ కోసం వెళ్లే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. దీంతో TS ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులు ఇవాళ్టి నుండి ఈ నెల 14 వరకు నడవనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ చార్జీలతోనే బస్సులు నడిపిస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

సంక్రాంతి పండుగ కోసం TS ఆర్టీసీ ఈసారి 4వేల 233 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. ఒకేసారి తిరుగు ప్రయాణానికి కూడా టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇక ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఎండీ సజ్జనార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు బస్సులు అందించడానికి రద్దీ ప్రాంతాల్లో DMలు, DVMలు, RMలు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌డ్‌ టికెట్ బుకింగ్‌ను 30 నుంచి 60 రోజులకు పెంచారు. ఈ ఏడాది జూన్ వరకు ఈ బుకింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. 4వేల 233 ప్రత్యేక బస్సుల్లో 585 సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. పండుగ సందర్భంగా ఆంద్రప్రదేశ్‌కి రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి వాటిలో అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరు 20, ఒంగోలు 13, గుంటూరు 12, విజయవాడ 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.

ఈ నెల 11 నుంచి 14 వరకు MGBS, JBS, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, KPHB, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు మరో 212 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. విజయవాడ 54, విశాఖపట్నం 19, అమలాపురం 23, శ్రీకాకుళం 9, ఏలూరు 11, రాజమండ్రి 12, గుంటూరు 29, బాపట్ల 5, చీరాల 7, మచిలీపట్నం 5, గుడివాడ 6, తెనాలి 4, రాజోలు 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

మరోవైపు ప్రత్యేక బస్సుల ద్వారా భారీ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది TS ఆర్టీసీ. దసరాకి 80 కోట్ల రూపాయలు వరకు రాగా ఈసారి 100 కోట్లు టార్గెట్ పెట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories