
Telangana: మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు సర్కార్ కార్యాచరణ
Telangana: బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్న సర్కార్
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధం అయింది. ఈ బడ్జెట్లోనే వాటికి నిధులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాలను అమలు చేసేలా పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని భావిస్తుంది. ప్రజాపాలన దరఖాస్తులను సైతం నిరంతరం అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించగా... ఇప్పటికే రెండింటిని అమలు చేయగా.. మరో రెండు గ్యారంటీల అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులకు లబ్ధి చేకూరేలా గ్యారంటీలను అమలు చేయనుంది. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వీటి అమలుకు ఎంత ఖర్చు కానుందనే విషయాన్ని అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు.
ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు చేశారని... కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు వివరించారు. వాటిని మరోసారి పరిశీలించాలని అధికారులకు సూచించారు. దరఖాస్తు చేయని వారుంటే నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




