Pity Story: సరిహద్దులో వీర జవాను.. నగరంలో ఆటోవాలా!

Pity Story: ఒకప్పుడు దేశం కోసం పోరాడిన ఆ సైనికుడు ఇప్పుడు కుటుంబ పోషణ కోసం పోరాడుతున్నాడు.

Arun Chilukuri
Published on: 5 March 2021 5:35 PM IST
Pity Story: సరిహద్దులో వీర జవాను.. నగరంలో ఆటోవాలా!
X

సరిహద్దులో వీర జవాను.. నగరంలో ఆటోవాలా!

Telangana: ఒకప్పుడు దేశం కోసం పోరాడిన ఆ సైనికుడు ఇప్పుడు కుటుంబ పోషణ కోసం పోరాడుతున్నాడు. దాయాది దేశం పాకిస్తాన్ తో తుపాకి పట్టుకుని యుద్దం చేసిన ఆయన ఇప్పడు బ్రతుకు బండి నడిపేందుకు ఆటో బండి పట్టాడు. ఏడు పదుల వయస్సులో పొట్టకూటి కోసం కష్టాలు పడుతున్నాడు. ప్రభుత్వ సహకారం లేక ఓ మాజీ సైనికుడి బతుకు దీనంగా మారిన వైనంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

ఇతని పేరు షేక్ అబ్దుల్ కరీమ్. ఈయన ఓ మాజీ సైనిక ఉద్యోగి. తండ్రి ఫరీద్ అప్పటికే ఆర్మీలో ఉండటం వల్ల ఆయన ప్రోత్సాహంతో 1967లో భారత సైన్యంలో చేరారు. ఆపరేషన్ రేడియో ఆర్టిలరీ లో గన్నర్ గా ఇతను పనిచేశారు. అనంతరం 1971 లో జరిగిన భారత్ పాక్ యుద్దంలో కూడా పాల్గొన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సైన్యంలో 9 సంవత్సారాలు మాత్రమే పనిచేశారు. దీంతో పెన్షన్ లభించడంలేదు. వీరి భాద్యతలు చూసుకోవాల్సిన కొడుకుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో రోజు గడవటం కష్టంగా మారింది. ప్రస్తుతం భార్య సుల్తానాతో కలిసి రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్నారు.

షేక్ అబ్దుల్ కరీమ్ కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. వీరందరకి వివాహం చేశారు. కుమారులకు కూడా సరైన ఉద్యోగంలేక పోవడంతో ఇప్పుడు ఈ వృద్ద దంపతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో రుణం తీసుకుని ఆటో కొనుక్కున్న కరీం గత 7సంవత్సరాలుగా రాజేంద్ర నగర్ పరిధిలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని వెళ్ళదీస్తున్నాడు.

భారత సైన్యం లో పని చేసని తర్వాత గతంలో భువనగిరరి పరిధలోని వలిగొండ మండలం గొల్లపల్లి గ్రామంలో సర్వే నంబర్ 183 లో కరీమ్ కు 5ఎకరాల భూమిని సాగుకోసం ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఇప్పడు ఆభూమి వేరే వారి పేరుతో రిజిస్టర్ చేశారని మరో చోట తనకు స్థలాన్ని ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు స్థలం కేటాయించినట్లు పత్రాలు ఇవ్వలేదని కరీం ఆవేదన వ్యక్తం చేసారు. చాలా సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా స్పందన లేదని చెబుతున్నారు. కనీసం రెండు పడక గదుల ఇల్లైనా కేటాయిస్తే కిరాయి లేకుండా ఈ చివరి రోజులు గడుపుతానంటున్నారు కరీం.

దేశం కోసం సరిహద్దులో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఓ వీర జవాను, ప్రభుత్వ సహకారం అందకా ఏడు పదుల వయసులో పొట్టకూటి కోసం ఆటో చేత బట్టాడు. ఈ కథనాన్ని చూసైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ఈ వృద్దుడి కష్టాలు తీరుస్తారని ఆశిద్దాం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story