MLA Raja Singh: వార్‌ సీన్‌ను తలపిస్తున్న అరెస్ట్ ఎపిసోడ్.. పీడీ యాక్ట్ ప్రయోగం సీక్రెట్స్ ఏంటి.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?

MLA T Raja Singh Held Under Stringent PD Act now
x

MLA Raja Singh: వార్‌ సీన్‌ను తలపిస్తున్న అరెస్ట్ ఎపిసోడ్.. పీడీ యాక్ట్ ప్రయోగం సీక్రెట్స్ ఏంటి.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?

Highlights

MLA Raja Singh: కామెడీ షోనే కదా అనుకుంటే సీరియస్ ఇష్యూ అయి కూర్చుంది.

MLA Raja Singh: కామెడీ షోనే కదా అనుకుంటే సీరియస్ ఇష్యూ అయి కూర్చుంది. ఫారూఖీ వచ్చారు వెళ్లారు కానీ ఉద్రిక్తతలు మాత్రం టు బి కంటిన్యూ అంటున్నాయి. తెలుగు రాష్ట్రాల హిస్టరీలోనే ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌కు అదే కామెడీ షో కారణమైంది. ఎమ్మెల్యే రాజాసింగ్‌ రెండోసారి అరెస్ట్, చర్లపల్లికి తరలింపు లాంటి టెన్షన్ ఎపిసోడ్స్‌ స్టేట్, సెంట్రల్ అనే తేడానే లేకుండా కంట్రీ పొలిటికల్ సినారియోనే మార్చేస్తున్నాయి. ఇంతకూ, మునావర్ ఫారూఖీ షో దగ్గర నుంచి రాజాసింగ్ రెండోసారి అరెస్ట్ వరకూ జరిగిందేంటి..? బీజేపీ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదుకు కారణమైన అంశాలేంటి..? పాతబస్తీలో ఉదృక్తతలకు ఇప్పట్లో చెక్ పడడం కష్టమేనా..?

భాగ్యనగరంలో ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ ఎపిసోడ్‌ రచ్చ క్షణక్షణం మారిపోతుంది. 23న అరెస్ట్, బెయిల్‌పై బయటకు రావడంతో నేడో రేపో ఉద్రిక్తతలు చల్లారుతాయని భావిస్తున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే సెకండ్ అరెస్ట్ వార్ సీన్‌ను తలపిస్తోంది. ఓ వైపు పాతబస్తీలో టెన్షన్ సీన్లు కంటిన్యూ అవుతున్న వేళ ఫారూఖీ షో జరగడానికి కారణమే టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే అని రాజాసింగ్ వీడియో రిలీజ్ చేశారు. కట్ చేస్తే మరోసారి రంగప్రవేశం చేసిన పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన విషయాన్ని ప్రకటించారు. దీంతో ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విడుదల చేసిన వీడియోతో మొదలైన వివాదం అంతకుమించి అన్నట్టుగా మారిపోయింది. అయితే, రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగం సీక్రెట్స్ ఏంటి..? తెలుగు రాష్ట్రాల హిస్టరీలోనే ఇప్పటి వరకూ రాని పరిస్థితి ఇప్పుడే ఎందుకొచ్చింది..?

ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ సింపుల్‌గా షార్ట్‌ కట్‌లో చెప్పాలంటే పీడీ యాక్ట్. సమాజంలో అల్లర్లు, దోపిడీలు, దొంగతనాలు, విద్వంశాలు చేసేవారి మీద ఈ చట్టం కింద 3 నుంచి 12 నెలలపాటు జైల్లో పెట్టవచ్చు, లేదా నిర్బంధించే అవకాశం ఉంటుంది. చట్టం ముఖ్య ఉద్దేశ్యం సమాజాన్ని రక్షించడం మాత్రమే. సాధారణంగా పీడీ యాక్ట్‌ను దొంగతనాలకు అల్లర్లకు పాల్పడే రౌడీషీటర్ల మీద మాత్రమే అమలు చేస్తారు. రాజకీయ నాయకులపై ఇలాంటివి ప్రయోగించడం ఆల్మోస్ట్ అసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయడం హైటెన్షన్‌కు కారణమవుతోంది. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి ముందు నుంచీ ఉన్న కేసులను బయటకు తీశారు. రాజాసింగ్‌పై 2004 నుంచి 101 క్రిమినల్‌ కేసులు నమోదు కాగా వాటిలో 18 కేసులు మతపరమైనవేనని పోలీసులు తెలిపారు. రాజాసింగ్‌ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని అన్నారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు విధ్వంసానికి దారితీస్తాయని అన్నారు పోలీసులు.

మరోవైపు అరెస్ట్‌కు ముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన రాజాసింగ్ సిటీలో ఫారూఖీ షో జరగడానికి కారణం టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలేనని ఆరోపించారు. తాను వీడియో రిలీజ్ చేయడానికి కారణం మునావర్ ఫారూఖీనే అన్నారు. కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తినని ఎవరిపైనా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటే అందుకు కారణం ఎంఐఎం నేతలేనని ఆరోపించారు. తాజా పరిణామాలన్నీ తనను నగరం నుంచి బహిష్కరించే కుట్రలే అని ఆరోపించారు. ఇది జరిగిన కొద్ది సేపటికే పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు.

ఓ వైపు రాజాసింగ్ అరెస్ట్ రచ్చ కొనసాగుతుండగానే సీఎం కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. పరోక్షంగా రాజాసింగ్ ఎపిసోడ్‌ను టచ్ చేస్తూ తెలంగాణ ప్రశాంత వాతావరణంలో పురోభివృద్ధి దిశగా పయనిస్తుంటే, కొందరు మతపిచ్చితో దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి స్వార్థపరులను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి దెబ్బతింటే వందేళ్లు నష్టపోతామని అన్నారు. బంగారు పంటలు పండే తెలంగాణ కావాలో, మతపిచ్చితో భగ్గుమనే తెలంగాణ కావాలో ప్రజలే తేల్చుకోవాలని పేర్కొన్నారు.

కేసీఆర్ పవర్‌ పంచ్‌లకు బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్స్ వచ్చాయి. ఈసారి ఆ పార్టీ తెలంగాణ చీఫ్ మీడియా ముందుకు వచ్చి మునావర్ దేశ భక్తుడా అంటూ విరుచుకుపడ్డారు. ఫారూఖీని ఎందుకు పిలిపించారని ప్రశ్నిస్తూనే పేరు మాది విధ్వేషం మీదీ అంటూ కౌంటర్లిచ్చారు. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి జనం అటెన్షన్‌ను డైవర్ట్ చేయడానికే ఘర్షణలు సృష్టిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

రాజాసింగ్ అరెస్ట్, ఓల్డ్ సిటీ టెన్షన్ ఎపిసోడ్‌పై అధికార, విపక్షాల కౌంటర్స్ కంటిన్యూ అవుతుండగానే సీన్‌లోకి ఎంఐఎం చీఫ్ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడూ హిందీలో ట్వీట్ చేసే అసద్ ఈసారి తెలుగులో ట్వీట్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేశారు. ఒకేఒక్క బైపోల్‌ కోసం కమలం పార్టీ ఇంతకు తెగించాలా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణను అగ్నికి ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తూనే షాపులు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇళ్లల్లోంచి రాకుండా చేసి కర్ఫ్యూ సృష్టించాలనుకుంటున్నారా అంటూ ఫైర్ అయ్యారు. అల్లా దయతో ఇవన్నీ జరగకూడదన్న ఓవైసీ బీజేపీ సృష్టిస్తున్న హింసాకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దామంటూ ట్వీట్‌ చేశారు.

మరోవైపు వైఎస్సార్ టీపీ అద్యక్షురాలు షర్మిల కూడా కమలనాథులను కార్నర్ చేశారు. తెలంగాణలో మత చిచ్చు పెట్టి, రాజకీయ నేతలు చలి కాచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. శాంతి, భద్రతలకు విఘాతం కల్గిస్తున్న రాజాసింగ్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. మొత్తంగా రాజాసింగ్ ఎపిసోడ్ టీపాలిటిక్స్‌లో పెను దుమారాన్నే రేపుతోంది. ఇది సరిపోదన్నట్టు ఓల్డ్ సిటీలో టెన్షన్ పరిణామాలు ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రానున్న రోజుల్లో రాజాసింగ్ అరెస్ట్ ఎపిసోడ్ ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories