Talsani accepting Bhatti Vikramarka challenge : భ‌ట్టి విక్ర‌మార్క స‌వాల్‌ను స్వీక‌రించిన మంత్రి త‌ల‌సాని

Sumitra
Published on: 17 Sept 2020 1:01 PM IST
Talsani accepting Bhatti Vikramarka challenge : భ‌ట్టి విక్ర‌మార్క స‌వాల్‌ను స్వీక‌రించిన మంత్రి త‌ల‌సాని
X

Talsani accepting Bhatti Vikramarka challenge : నగరంలో గురువారం రోజున ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క శాసనసభలో విసిరిన సవాలును స్వీక‌రించారు. నిన్న జరిగిన శాసనసభలో ఇద్ద‌రి మ‌ధ్యలో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా స్వ‌ల్ప వివాదం చోటు చేసుకుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడేందుకు కొద్దినిమిషాల ముందు కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ల మధ్య వాడీవేడీ వాగ్వాదం జరిగింది. మహానగరంలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరిపితే తమకు చూపించాలని భట్టి డిమాండ్‌ చేసారు. దాన్ని తప్పుపడుతూ మంత్రులు వ్యాఖ్యలు చేయడంతో కొద్దిసేపు సభ వేడేక్కింది.

దీంతో గురువారం ఉదయం మంత్రి తలసాని, ఎమ్మెల్యే వివేకానంద‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, ఇతర అధికారులతో నేరుగా భట్టి విక్రమార్క ఇంటికి చేరుకున్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల వివ‌రాలు పూర్తిగా వివ‌రిస్తామ‌ని త‌ల‌సాని తెలిపారు. అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను చూపిస్తామని తమతో రావాలని డిమాండ్‌ చేశారు. మంత్రి తలసాని కోరిక మేరకు భట్టి వారితో ఒకే కారులో బయలుదేరారు. తాను విసిరిన సవాల్ తో తమ ఇంటికి ఇంటికి వచ్చిన మంత్రిని చూసి భట్టి ఒక్కాసారిగా షాక్‌ అయినప్పటికీ తరువాత తలసానిని ఆయన సాదరంగా లోపలకి ఆహ్వానించారు. ఆ తరువాత కొద్ది సేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుని ఆ తరువాత అక్క‌డ్నుంచి విక్ర‌మార్క‌ను తీసుకుని జియ‌గూడ‌లోని డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల ప‌రిశీల‌న‌కు బ‌య‌ల్దేరారు.

నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌పై 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌, 2014-2020 వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టిన ఖర్చును వివరించిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్‌ పదేండ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.4,636 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లలో క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ రూ.32,533 కోట్లు ఇచ్చిందని తెలిపారు. గత ఆరేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.67,135 కోట్లను క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌గా వివిధ రూపాల్లో ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ కూడా కలిపితే రూ.లక్ష కోట్లు దాటుతుందని చెప్పారు. పేదవారిపై ఒక్క రూపాయి భారం పడకుండా సుమారు రూ.10వేల కోట్లతో ఇండ్లు కట్టిస్తున్నామన్నారు.

Sumitra

Sumitra

Next Story