Hyderabad: కలగానే మిగిలిపోయిన పాతబస్తీకి మెట్రో రైల్

Hyderabad: ప్రయాణీకుల ట్రాఫిక్ కష్టాలకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు..?

Rama Rao
Updated on: 15 Jun 2022 8:01 PM IST
Metro Work in Old City Hyderabad | Hyderabad News
X

Hyderabad: కలగానే మిగిలిపోయిన పాతబస్తీకి మెట్రో రైల్ 

Hyderabad: పాతబస్తికి మెట్రో రైల్ వస్తుందా..? రెగ్యులర్ ట్రాఫిక్ నరకానికి ఫుల్ స్టాప్ పడుతుందా..? ప్రయాణీకుల అవస్థలు తగ్గుతాయా..? గత కొన్నేళ్ల నుంచి వినిపిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు అధికారుల దగ్గర కూడా లేవు. తొలిదశలో మిగిలిపోయిన 3 కిలోమీటర్ల మెట్రో లైన్ కు మోక్షం ఎప్పుడు కలుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అడుగు కూడా ముందుకు పడటం లేదు.

హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో కీలకంగా మారిన మెట్రో రైల్ కరోనా తర్వాత పునర్ వైభవం కోసం పరుగులు పెడుతోంది. ఇప్పటికే తొలిదశలో 72 కిలోమీటర్లకు గానూ 69 కిలోమీటర్ల మేర మెట్రో ట్రాన్స్ పోర్ట్ అందుబాటులోకొచ్చింది. కరోనాకు ముందు లాభాల్లో నడిచిన మెట్రో.. మెల్లిమెల్లిగా పునర్ వైభవం కోసం కష్టపడుతోంది. మియాపూర్ నుంచి నాగోల్, ఎల్బీ నగర్ నుంచి అమీర్ పేట్, అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు మొత్తం మూడు మార్గాలు వివిధ దశల్లో అందుబాటులోకొచ్చాయి. దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా గుర్తింపు పొందినా బ్యాలెన్స్ పనులు మాత్రం అంతవేగంగా జరగడం లేదు.

అయితే మొదటిదశలో మిగిలిన పనులన్నీ పాతబస్తీలోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చార్మినార్ వరకు మెట్రోను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తొలిదశలోనే ఇందుకు అడుగులు పడ్డా.. స్థానికుల్లో కొందరి నుంచి అభ్యంతరాలు, రాజకీయంగా ఇబ్బందులు రావడంతో పనులకు బ్రేక్ పడింది. దీంతో పాతబస్తీలో మెట్రో పరుగులు ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులు చార్ మినార్ ను చూడాలంటే ఎంజీబీఎస్ వరకు మెట్రోలో వచ్చి ఆ తర్వాత రోడ్ మార్గాన రావాల్సి ఉంది.

అసలు పాతబస్తీలో మెట్రో రైల్ పరుగులు పెడుతుందా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. మెట్రో వస్తే ఓల్డ్ సిటీ రూపురేఖలు మారిపోవడమే కాదు.. డెవలప్ మెంట్ కూడా జరుగుతుందని అందుకు త్వరతిగతిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story