
కొత్త పథకాలు తెచ్చే ప్లాన్లో కేసీఆర్
* వచ్చే ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్
KCR: వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఒక్కొక్క ఆస్త్రాలను బయటకు తీస్తున్నారా..? గతంలో రైతుబంధు, దళిత బంధు, గిరిజన బంధు లాంటి పథకాలను ప్రకటించిన ముఖ్యమంత్రి ఈసారి కొత్త ప్లాన్స్ తో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా..?
గత 2018 ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతుబంధు స్కీమ్ ను అమలు చేసి తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నారు. ఇదే పథకం కేసీఆర్ ను ఆ అసెంబ్లీ ఎన్నికలలో గట్టెక్కించిందనే వాదన ఉంది. ఈసారి దళితబంధుతో ప్రయత్నించాలని అనుకున్నారు. కానీ పెద్దగా వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లోనే ఫలితాలు తారుమారు అయ్యాయి. దీంతో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కేసీఆర్ మళ్లీ రైతులనే ఆకట్టుకునేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రైతులకు పెన్షన్ స్కీమ్ ప్రవేశ పెట్టడానికి కసరత్తు దాదాపుగా పూర్తి చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కీమ్ ను మొదటగా అమలు చేయడం అనే దానిపై కసరత్తు జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమా అనే అంశంపై బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది.
ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని దృడ సంకల్పంతో గులాబీ దళం రంగంలోకి దిగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన స్కీంలతో పాటు కొత్తగా రైతులకు పెన్షన్ స్కీమ్ ను అందుబాటులోకి తేవడానికి మేధో మధనం చేస్తోంది సర్కార్. వ్యవసాయ భూమి పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకూ పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా సమాచారం. ప్రభుత్వం వద్ద ఉన్న రైతుబంధు పథకం లెక్కల ప్రకారం 68 లక్షల రైతుల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రైతు కుటుంబానికీ పెన్షన్ ఇవ్వాలని యోచిస్తున్నారు ముఖ్యమంత్రి. అయితే 2023-24 వార్షిక బడ్జెట్లో ఈ స్కీమ్ ప్రస్తావన లేదు. నిధుల కేటాయింపు లేదు. ఇదివరకు దళిత బంధు పథకం బడ్జెట్లో పెట్టకుండానే ప్రారంభించారు. అంతకు ముందు 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రైతుబంధు స్కీంను కూడా అప్పుడు బడ్జెట్లో పెట్టలేదు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో ఉత్తరాదిలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న కేసీఆర్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రైతుకు పెన్షన్ స్కీమ్ బాగా ఉపయోగపుడుతుందని అనుకుంటున్నారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని ఈ విశిష్ట పథకాన్ని ప్రారంభిస్తే అన్ని వర్గాల్లో మరోసారి బీ ఆర్ ఎస్, సీఎం కేసీఆర్ పేరు రాజకీయ వర్గాల్లో మారుమ్రోగుతుందని ఆ పార్టీలో సీనియర్ నేతలు భావిస్తున్నారు.
తెలంగాణలో కొత్తగా రైతుల కోసం ప్రత్యేకంగా రైతు పెన్షన్ స్కీమ్ ను తీసుకురావడం వల్ల ఈ ఏడాది చివరన జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ పార్టీకి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. దీన్ని ఎన్నికలకు ముందు అమలులోకి తేవడం లేదా వచ్చే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలని యోచిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఒక్కటే కాదు. ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్న పథకాలను గురించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసి జాతీయ స్థాయిలో లబ్ధి పొందాలని గులాబీ బాస్ ఆలోచనలో ఉన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




