ఓటింగ్‌పై ఆసక్తి చూపని హైదరాబాదీలు.. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో 50శాతం నమోదుకాని ఓటింగ్‌

Arun Chilukuri
Published on: 30 Nov 2020 4:00 PM IST
ఓటింగ్‌పై ఆసక్తి చూపని హైదరాబాదీలు.. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో 50శాతం నమోదుకాని ఓటింగ్‌
X

ప్రజాస్వామ్యంలో ఓటరే మహారాజు. ఎందుకంటే ఒక్క ఓటు దేశ భవిష్యత్తును మార్చేస్తుంది. అదే ఒక్క ఓటు.. బడా బడా నేతల జాతకాలను తలకిందులు చేస్తుంది. మరి అటువంటి ఓటు హక్కు ఉన్న హైదరాబాద్‌ ప్రజలు కొన్నేళ్లుగా పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఇకపై కొనసాగొద్దని ఎస్‌ఈసీ అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలు ఓటు వేయాలంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో గొప్ప వరం ఓటు హక్కు. ఎందుకంటే ప్రజాస్వామంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి. ప్రధానంగా జనాభీష్టం ప్రతిఫలించినప్పుడే ప్రజాస్వా్మ్య వ్యవస్థకు సార్థకత ఉంటుంది. ఇక ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలు కాబట్టి రాజకీయ పార్టీల జాతకాలను మార్చే సత్తా కూడా ఓటర్లకే సొంతమని చెప్పచ్చు. ఇందులో భాగంగా పాలనావ్యవస్థపై అసంతృప్తి పెల్లుబికినప్పుడు అధికారంలో ఉన్న నేతలను కూడా గద్దె దింపిన ఘనత ఓటర్ల సొంతమని జగమెరిగిన సత్యం.

అయితే ఓటు వేసే విషయంలో హైదరాబాదీలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకు గ్రేటర్‌లో ఓటింగ్‌ పర్సెంటేజ్‌ యాభై శాతం మించిన దాఖలాలు కనిపించలేదు. ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ అధికారులు ఓటింగ్‌ శాతం పెంచేందుకు విస్తృత ప్రచారం చేపట్టినా.. అటు ప్రభుత్వం ఎలక్షన్‌ సమయంలో సెలవు ప్రకటించినా.. ప్రజలు మాత్రం ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఓటింగ్‌ నమోదయ్యే నగరం హైదరాబాద్‌ అంటేనే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

స్థానిక సంస్థల ఎన్నికలే కాదు సాధారణ ఎన్నికల్లోనూ హైదరాబాదీల తీరు మారడం లేదు. 2014 ఎన్నికల్లో 53శాతం మంది కూడా ఓటు వేయలేదు. ఇక 2016 ఎన్నికల్లో కేవలం 45.27శాతం ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయి. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 74 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 50శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. నగరంలో అత్యల్పంగా అజంపురాలో 10.60 శాతం, ముసరాంబాగ్‌లో 13.24 శాతం, తలాబ్‌కట్టలో 14.78 శాతం, రెయిన్‌ బజార్‌లో 15.61 శాతం, సూరారంలో 16.44శాతం ఓట్ల పర్సెంటేజ్‌ నమోదైంది.

ప్రజాపాలన సజావుగా సాగాలన్నా, సరైన నేతలకు అధికారం కట్టబెట్టాలన్నా ఇప్పటికైనా నగర ప్రజలు ఎన్నికల రోజున ఇంట్లో కూర్చోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒకవేళ బరిలో ఉన్న నేతలు నచ్చకపోయిన ఆమాట నోటా ద్వారా చెప్పుకోవాలి. కానీ ఓటు మాత్రం తప్పకుండా వినియోగించుకోవాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story