హుజూర్ నగర్ ఓట్ల లెక్కింపు: 11 వేల ఓట్ల ఆధిక్యంలో టీఅరెస్
రాజకీయ పరిశీలకులతో పాటూ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నహుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. ఈరోజు (అక్టోబర్ 24) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించారు.
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 5 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. అధికార టీఆరెస్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఐదో రౌండ్ పూర్తియ్యేసరికి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 11 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్లోనే జరుగుతున్న లెక్కింపు ప్రక్రియ కోసం మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.లెక్కింపునకు రిటర్నింగ్ అధికారికి ప్రత్యేకంగా మరో టేబుల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆయన ఈ ప్రక్రియను పరిశీలిస్తారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, పరిశీలకుడిని నియమించారు. లెక్కింపు ప్రక్రియను జిల్లా సాధారణ పరిశీలకుడు సచీంద్ర ప్రతాప్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రౌండుకు ర్యాండమ్గా రెండు ఈవీఎంల ఫలితాలు సరిచూసిన తర్వాతే.. ఫలితాన్ని వెల్లడిస్తున్నారు. ఒక్కో రౌండుకు సుమారు 20 నిమిషాలు సమయం పడుతోంది. తుది ఫలితం మధ్యాహ్నం 12.30 గంటలకు వెలువడే అవకాశం ఉంది.


