Harish Rao: ప్రస్తుతం అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు

Harish Rao: గతంలో రైతులు నష్టపోతే కేసీఆర్ వెళ్లి రైతులను పరామర్శించారు

Jyothi
Published on: 19 March 2024 1:34 PM IST
Harish Rao Comments On Congress Govt
X

Harish Rao: ప్రస్తుతం అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు

Harish Rao: తెలంగాణలో కురిసిన అకాల వడగళ్ల వానలతో రైతన్నలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేశాయని ట్వీట్ చేశారు హరీష్‌రావు. పంటలు చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వాన రైతులకు కన్నీరును మిగిల్చిందన్నారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారన్నారు. అక్కడికక్కడే ఎకరాకు పది వేల రూపాయల నష్టపరిహారం ప్రకటించారని గుర్తుచేశారు.

కానీ రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు రాజకీయాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడంతో పాటు 10 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలని ట్విట్టర్‌లో కోరారు మాజీ మంత్రి హరీష్‌రావు.

Jyothi

Jyothi

Next Story