పరిశ్రమల పేరుతో ప్రభుత్వభూముల దోపిడీకి సర్కార్ చెక్ !

Arun Chilukuri
Published on: 27 Aug 2020 12:31 PM IST
పరిశ్రమల పేరుతో ప్రభుత్వభూముల దోపిడీకి సర్కార్ చెక్ !
X

Govt to crack whip on industries which failed to start unit in allotted land: తెలంగాణలో ప‌రిశ్రమ‌‌ల పేరుతో భూములు తీసుకుని స్థాపించకుంటే ఇక ముందు కుదరదు అంటోంది కేసీఆర్ సర్కారు. భూముల‌ను తీసుకుని ఏళ్లు గ‌డిచినా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయ‌ని కంప‌నీలకు షోకాజ్ నోటీస్ లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం. అలాగే పరిశ్రమల పేరుతో తీసుకున్న భూముల‌ను ఇతర అవసరాలకు వినియోగిస్తే కొరాడా ఝులిపించడానికి ప్రభుత్వం సిద్ధమయ్యింది.

తెలంగాణ‌లో ప్ర‌భుత్వం పారిశ్రామిక‌ రంగం అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. టిఎస్ ఐపాస్ తో పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆక‌ర్షిస్తోంది. దీనిలో భాగంగా, ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేందుకు ముందుకు వ‌చ్చిన వారికి నామమాత్రపు ధ‌ర‌లకు వందల ఎకరాల భూముల‌ను కేటాయింది. ఇలా భూములు ద‌క్కించుకున్న కొంద‌రు ఇప్ప‌టి వ‌ర‌కు ఆ భూముల్లో ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌లేదు. దీన్ని గ‌మ‌నించిన ప్ర‌భుత్వం ఇలాంటి ప‌రిశ్ర‌మ‌ల‌పై కొర‌డా ఝుళిపిస్తామని హెచ్చరించింది.

ఇప్పటివరకు పరిశ్రమల కోసం భూములను తీసుకొని నిరుపయోగంగా ఉన్న వాటిపైన మంత్రి కేటీఆర్ స‌మీక్ష సమావేశం నిర్వహించారు. ప‌రిశ్ర‌ల‌మ‌తో ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పెట్టుబడులు తెస్తున్నామని, అయితే కంపెనీలు కూడా తాము ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని మంత్రి అన్నారు. అయితే, నాడు కంప‌నీలు చెప్పిన నిర్ణీత గడువు ముగిసినా నేటికి ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్ప‌క‌పోడంపై సీరియ‌స్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిశ్ర‌మ‌లు స్థాపించ‌కుండా టైమ్ పాస్ చేస్తున్న వారికి షోకాజ్ నోటిస్ ఇవ్వాల‌ని అధికారులను ఆదేశించారు కేటీఆర్.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలకు సంబంధించిన‌ సమగ్ర సమాచారంతో బ్లూ బుక్ ని తయారు చేయాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో అన్ని పరిశ్రమల సమగ్ర సమాచారం ఆయా కంపెనీలు నిర్వహిస్తున్న వారి వివరాలు, పరిశ్రమల కేటగిరిలతో స‌హా పూర్తి వివరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆధికారుల‌కు సూచించారు. దీని ద్వారా ఉప‌యోగంలో ఉన్న పరిశ్రమలు ఎన్నీ, లేనివి ఎన్నో తేలుస్తుందని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఒక‌వైపు టిఎస్ ఐపాస్ తో తెలంగాణ‌లో పారిశ్రామిక రంగానికి బ‌ల‌మైన పునాదులు వేస్తున్న ప్ర‌భుత్వం మ‌రోవైపు ప‌రిశ్ర‌మ‌ల పేరుతో కొంద‌రు ఆడుతున్న దొంగాట‌కు చెక్ పెట్టాల‌ని చూస్తోంది. దీనిలో భాగంగా నిబంధన‌ల‌ను ఉల్లంఘించి భూములను నిరుప‌యోగంగా ఉంచిన‌ కంప‌నీల‌పై కొర‌డా ఝుళిపించేందుకు అడుగులు వేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story