400 ఏళ్లనాటి చరిత్ర.. ఏరువాడ జోడు పంచెలంటే ఏంటీ...?

Gadwal Weave Workers Offer Eruvada Jodi Panchalu To Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...
Gadwal Weave Workers Offer Eruvada Jodi Panchalu To Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి మూల మూర్తికి ఎరువాడ జోడు పంచెలు కట్టడం ఆనవాయితీ. గత 400 సంవత్సరాలుగా వస్తుందీ ఆనవాయితీ. తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ సంస్థానాధీశుల కాలం నుంచి స్వామివారికి జోడు పంచెలను సమర్పించటం సంప్రదాయం. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల్ సంస్థానం నుంచి శ్రీవారి సన్నిధికి ఈ జోడు పంచెలు కానుకగా చేరాయి.
ఏరువాడ జోడు పంచెలంటే ఏంటీ...?
ఏరు అంటే నదీపరివాహక ప్రాంతం అని అర్థం. మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల్ నగరం పవిత్రమైన తుంగభద్ర, కృష్ణానది మధ్య ఉంది. ఈ రెండు నదుల మధ్య ఉండే ఈ ప్రాంతంలో చేనేత మగ్గాలపై జోడుపంచెలు తయారు చేయటం సంప్రదాయం. అందుకే ఈ పంచెలు ఏరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి పొందాయి. గద్వాల సంస్థానాధీశులు సీతారాంభూపాల్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం ఆనవాయితీ. అదే సంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత గద్వాల్ సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్ వీటిని తిరుమలేశునికి కానుకగా సమర్పించారు.
గద్వాల సంస్థానాధీశుల విజ్ఞప్తి మేరకు ఐదేళ్లుగా స్థానిక లింగంబాగ్ వాసి మహంకాళి కరుణాకర్ ఈ పంచెలను నేస్తున్నారు. సాక్షాత్తు కలియుగ దేవదేవునికి అలంకరించే వస్త్రాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక మగ్గంతో ఐదుమంది సహచర చేనేత కార్మికులు కలిసి సిద్ధం చేశారు. మొత్తం 41 రోజుల పాటు దీక్షతో ఈ జోడు పంచెలు తయారు చేశారు. ఒకో పంచె 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు ఉంటుంది. అలాగే పంచె అంచును 15 అంగుళాల వెడల్పుతో తయారు చేశారు. ఈ జోడు పంచెలపై రాజకట్టడాల గుర్తుగా ఎనిమిది కోటకొమ్మ అంచులతో కళాత్మకంగా నేసారు. ఈ పంచెల్ని ప్రతీ సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందురోజు మూలమూర్తికి అలంకరిస్తారు. అలా స్వామివారికి అలంకరించిన వాటిలో ఓ పంచెను శేషవస్త్రంగానూ, శ్రీవారి ప్రసాదాలను కానుకగా గద్వాల సంస్థానానికి పంపటం తిరుమల ఆలయ సంప్రదాయం.