కరోనా పేషంట్లకు అండగా పీర్జాదిగూడ కార్పొరేషన్

కరోనా పేషంట్లకు అండగా పీర్జాదిగూడ కార్పొరేషన్
x
Highlights

మీకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందా..? ఇంట్లో గదులు లేక హోం క్వారంటైన్‌లో ఉండలేకపోతున్నారా..? లక్షల్లో డబ్బులు ఖర్చ అవుతున్నాయా..?...

మీకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందా..? ఇంట్లో గదులు లేక హోం క్వారంటైన్‌లో ఉండలేకపోతున్నారా..? లక్షల్లో డబ్బులు ఖర్చ అవుతున్నాయా..? అయితే ఒక్క నిమిషం ఆగండి పేద, మధ్య తరగతి కుటుంబాల కోసమే తాము ఉన్నామంటూ అక్కున చేర్చుకుంటోంది ఆ కార్పొరేషన్. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా చికిత్స అందిస్తోంది. ఆ ఐసోలేషస్ కేంద్రం గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.

కరోనా బారిన పడిన పేదలకు అండగా ఉండేందుకు పీర్జాదిగూడ కార్పొరేషన్‌ ముందుకు వచ్చింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయి చిన్న ఇల్లు, ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉండేందుకు గదులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని అక్కున చేర్చుకుంటోంది. ఇందుకోసం కార్పొరేషన్‌ తన సొంత నిధులతో మేడిపల్లిలో సకల సౌకర్యాలతో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆహ్లాదకర వాతావరణంలో, విశాలమైన స్థలంలో ఉన్న భవనంలో 30పడకలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మంత్రి మల్లారెడ్డి ప్రారంభించిన ఈ ఐసోలేషన్‌ కేంద్రంలో కరోనా యాంటీజెన్‌ పరీక్షలనూ చేస్తున్నారు. నిత్యం పల్స్‌ ఆక్సీమీటర్‌తో పరీక్షలు చేస్తారు. ఒక్క వెంటిలేటర్‌ సౌకర్యం మినహా కార్పొరేట్‌ ఆస్పత్రి తరహాలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇక ప్రారంభించిన మూడు రోజుల్లోనే ఈ కేంద్రంలో 15మంది చేరారు. అయితే పీర్జాదిగూడ కార్పొరేషన్‌ మొదటి ప్రాధాన్యం స్థానికులకే ఇస్తోంది. మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి చొరవ తీసుకుని కొందరు దాతల సహకారంతో బెడ్స్‌ ఏర్పాటు చేశారు.

సెంటర్‌ నిర్వహణకు ఇద్దరు డాక్లర్లను, తొమ్మిదిమంది నర్సులను, అటెండర్లు, ఆస్పత్రి అడ్మిన్‌గా ఒకరిని నియమించారు. ఐసోలేషన్‌ కేంద్రంలో చేరే వారికి యోగా, ఇతర వ్యాయామాలు చేయించేందుకు ఓ ఫిజికల్‌ డైరెక్టర్‌ కూడా ఉన్నారు. అలాగే ఈ కేంద్రంలో చేరిన రోగులకు పౌష్ఠికాహారం అందిస్తున్నారు. ఉదయం గ్రీన్‌ టీ, అల్లం చాయ్‌, అల్పాహారం, 11 గంటలకు డ్రైఫ్రూట్స్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 4 గంటలకు స్నాక్స్‌, ఫ్రూట్స్‌ రాత్రి 7 గంటలకు పుల్కా, భోజనం పెడుతున్నారు. ఏదీ ఏమైనా కరోనా బారిన పడిన వారికి ప్రైవేట్ ఆసుపత్రులు ఫీజులు లక్షల్లో వసూలు చేస్తుండగా పీర్జాదిగూడ కార్పొరేషన్ మాత్రం ఉచిత వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories