Etela Rajender Visits TIMS Hospital : టిమ్స్‌ ని పూర్తిస్థాయిలో కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చాం

Etela Rajender Visits TIMS Hospital : గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Sumitra
Published on: 2 Aug 2020 4:18 PM IST
Etela Rajender Visits TIMS Hospital : టిమ్స్‌ ని పూర్తిస్థాయిలో కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చాం
X
ఈటల రాజేందర్ ఫైల్ ఫోటో

Etela Rajender Visits TIMS Hospital : గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిని మంత్రి ఈటల ఆదివారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టిమ్స్ లో వైద్యులు, నర్సింగ్‌, మందులు అన్ని అందుబాటులో ఉన్నాయని మంత్రి రాజేందర్‌ వెల్లడించారు. అదే విధంగా 1,350 పడకలు, ప్రయోగశాలలు, ఐసీయూ అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కరోనా బాధితులకు అంకితభావంతో సేవలందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ ద్వారా ఈ కరోనా మహమ్మారితో అధిక మంది బాధపడుతున్నారని, ఆక్సిజన్‌ అందించినా కూడా కొందరు మృత్యువాత పడుతున్నారని ఆయన అన్నారు. కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే వంద శాతం కరోనా బారి నుంచి బయట పడతామన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల ఫీజులపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. కరోనా వైద్యం ఖరీదైనదేమీ కాదని, పదివేల లోపే బాధితుల వైద్యం ఖర్చువుతుందని పేర్కొన్నారు. సామాన్యులను దోపిడీ చేసి పీక్కుతినే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అనంతరం కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడి ఆరా తీశారు.

కరోనా ఆసుపత్రుల్లో సరిపడ పడకలు ఉన్నాయని ఆయన మరోసారి గుర్తు చేసారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేసారు. టిమ్స్ ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ వారం రోజుల్లో పెట్టిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీ, కింగ్‌ కోఠి, ఛాతీ ఆస్పత్రి, సరోజిని, టిమ్స్‌, ఆసుపత్రులు ఉన్నాయని చెప్పారు. రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని మంత్రి సూచించారు. ఫీవర్, చెస్ట్, ఉస్మానియా, సరోజిని, కింగ్‌కోఠి, వరంగల్ ఆసుపత్రుల్లోనూ ద్రవరూప ఆక్సిజన్ పెడుతున్నామని మంత్రి రాజేందర్‌ పేర్కొన్నారు. టిమ్స్‌లో కొందరు కరోనా బాధితులతో మాట్లాడానని, వారు వైద్యం బాగుందని చెబుతున్నారని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆస్పత్రిలోని ఫార్మసీ, డైనింగ్‌ రూమ్‌, క్యాంటీన్లను పరిశీలించారు.




Sumitra

Sumitra

Next Story