Komuravelle: మల్లన్న కష్టాలు.. జాతరలో ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం..

Komrelly Mallanna: తెలంగాణలో సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత అత్యంత ఘనంగా జరిగే జాతరలో కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ముఖ్యమయ్యింది.

Arun Chilukuri
Updated on: 8 Feb 2024 8:30 PM IST
Devotees Facing Problems in Komuravelli Mallanna Temple
X

Komuravelle: మల్లన్న కష్టాలు.. జాతరలో ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం..

Komrelly Mallanna: తెలంగాణలో సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత అత్యంత ఘనంగా జరిగే జాతరలో కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ముఖ్యమయ్యింది. కొమరెల్లి మల్లన్న అంటే కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా భక్తుల విశ్వాసం. దాదాపు మూడు నెలలపాటు జరిగే అతి సుదీర్ఘమైన జాతరగా పేరొచ్చింది.. అంతే స్థాయిలో భక్తుల తాకిడి కూడా ఉంటుంది.. అయితే ఎప్పటి మాదిరిగానే జాతరకు వస్తున్న భక్తుల సమస్యలు మాత్రం అన్నీ ఇన్నీ కావు.. అడుగడుగునా సమస్యలతో భక్తులు సతమతమవుతున్నారు.

కోరిన భక్తులకు కొంగు బంగారమైన విలసిల్లుతున్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర భక్తల రద్దీతో కిటకిటలాడుతోంది. జనవరి 7న ప్రారంభమైన జాతర ఘనంగా కొనసాగుతోంది. జాతరకు భారీగా తరలి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జనవరిలో ప్రారంభమైన జాతర ఏప్రిల్‌ నెలలో ముగుస్తుంది. మలన్న జాతరకు హైదరాబాద్‌, ఉత్తర తెలంగాణతో పాటు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు హాజరవుతారు. జాతర సమయంలో ప్రతి శనివారం సాయంత్రానికి కొమరవెల్లికి చేరుకునే భక్తులు ఆ మరుసటి రోజు మల్లన్న పట్నాలు నిర్వహించి.. బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుని.. నిద్ర చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే సోమవారం తిరుగు ప్రయాణం అవుతుంటారు.

భక్తులు అధికంగా వస్తుండటం ప్రతి ఏటా జరిగే తంతు అయినా ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రతి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా సమస్యలు తీర్చడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ కారణంగా వాహనాలను ఆలయానికి దూరంగా పార్కింగ్‌ చేయిండంతో వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఆలయం దగ్గర దాతల సహకారంతో నిర్మించిన గదులే తప్ప దేవాలయానికి సంబంధించిన గదులు సరిపడ లేకపోవడంతో భక్తల వసతి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అద్దె గదులు తీసుకోవాలంటే ఒక్క రోజులు వెయ్యి రూపాయల నుంచి 8వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో అంత మొత్త చెల్లించలేని భక్తులు చెట్ల కిందనే సేదదీరుతూ ఆరు బయటే పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మహిళా భక్తులకు స్నానాలు చేయడానికి సరైన సౌకర్యాలు కరువయ్యాయని, కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్వాహకులు ఆరుబయట ఏర్పాటు చేసిన సంప్‌ దగ్గరే భక్తులు స్నానాలు చేస్తున్నారు.

స్వామి దర్శనం కోసం క్యూలైన్లో నిల్చున్న భక్తులకు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. గంటల కొద్దీ క్యూలైన్లో వేచి చూడలేక కొంత మంది దర్శనం కాకముందే వెనుదిరుగుతున్నారు. క్యూ లైన్లో కూర్చోవడానికి బెంచీలు లేక.. తాగునీరు లేక చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు ధర్మదర్శనం లైన్‌లోనే కాకుండా ప్రత్యేక దర్శనం క్యూ లైన్లలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. దర్శనానికి గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఇదంతా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడమే కారణమని వాపోతున్నారు. సమస్యలను ఆలయ అధికారులతో పాటు, పాలకమండలి సభ్యులు వీటిపైన దృష్టిపెట్టి చర్యలుచేపట్టి పరిష్కారమయ్యేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

కొమరవెల్లికి వస్తున్న భక్తుల సంఖ్య రోజుకు 30వేలు దాటుతోందని.. ఆలయం నిర్వహణలో అద్దెగదులు సరిపడా లేవని.. ఉన్నవాటిలో కూడా ఎక్కువగా భక్తుల సాయంతో నిర్మించినవేనంటున్నారు ఆలయ అధికారులు. ఏది ఏమైనా మల్లన్న భక్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భక్తుల రద్దీ ప్రతి ఏటా ఉండేదే అయినా.. రద్దీకి తగిన ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.. ఇప్పటికైనా అధికారులు మేల్కొని భక్తుల అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story