Revanth Reddy: 15 రోజుల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో విజిలెన్స్ దాడులు

Revanth Reddy: న్యూయార్క్ టైం స్క్వేర్ తరహాలో ప్రకటనలు

Shekhar G
Published on: 24 Feb 2024 9:06 AM IST
CM Revanth Reddy Warning To GHMC And HMDA Officials
X

Revanth Reddy: 15 రోజుల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో విజిలెన్స్ దాడులు

Revanth Reddy: హైదరాబాద్ లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సమర్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. HMDA కార్యాలయంలో వాటర్ వర్క్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ పై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 15 రోజుల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని.. ఇష్టాను సారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు.

ఆన్‌లైన్‌లో లేకుండా ఇష్టారాజ్యంగా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు చేయాల్సిందే అన్నారు. HMDA వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోందని అధికారులను ప్రశ్నించారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న 3500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందేనని నిర్దేశించారు. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా వాటి దగ్గర తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలో పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన 85 మున్సిపాల్టీల్లో కమిషనర్లు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి గ్రూప్-1 అధికారులు కమిషనర్లుగా ఉండేలా చూడాలని ఆదేశించారు. మున్సిపాల్టీల్లో పని చేసే వర్కర్లకు ప్రమాద భీమా కల్పించడంపై ఆధ్యయనం చేయాలని ఆదేశించారు.

ప్రైవేట్ సెక్టార్ లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయమే లేచి కాలనీల్లో పర్యటించని జోనల్ కమిషనర్లు ఇంటికి వెళ్లిపోవచ్చని.. కుర్చిల్లో కూర్చొని పని చేసే పోస్టులు కావాలంటే ఇస్తామన్నారు. హైదరాబాద్ లో న్యూ యార్క్ టైం స్క్వేర్ తరహాలో వీడియో ప్రకటనల బోర్డు, మల్టీ యుటిలిటీ టవర్స్ ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వీధి దీపాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.

నగరంలో మంచినీటి కొరత లేకుండా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక చెరువులను స్టోరేజీ ట్యాంకులుగా ఉపయోగించాలన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీరు సరఫరా అయ్యేలా ప్రణాళిక రచించాలని ఆదేశించారు. సమావేశంలో రాష్ర్ట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు దాన కిషోర్, ఆమ్రాపాలి పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story