ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు : సీఎం కేసీఆర్

ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు : సీఎం కేసీఆర్
x
Highlights

తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా అమలు చేసిన చట్టాన్ని అధికారులు...

తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా అమలు చేసిన చట్టాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. శనివారం ఆయన రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) ప్రతినిధులతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి ట్రెసా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అనంతరం సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని ఉద్యోగులకు సూచించారు. ప్రజల్లో పెరిగిన చైతన్యానికి అనుగుణంగా పోలీస్‌ శాఖలో మార్పు వచ్చిందని, అదే తరహాలో రెవెన్యూ శాఖలోనూ మార్పురావాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. రెవెన్యూ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలని, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియ వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేదలను కడుపులో పెట్టుకొన్నట్లుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్నారంటూ సీఎం గుర్తు చేశారు. ప్రజలు కేంద్రబిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, అందులో భాగంగానే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చినట్టు చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ట్రెసా ప్రకటించింది. ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తామని తెలిపారు. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగింతపై సీఎంకు ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో భూపరిపాలన కమిషనర్‌ పోస్టు భర్తీ చేయాలని ట్రెసా ప్రతినిధులు సీఎంను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories