Haritha Haram Program: ఆరో విడుత హరితహారానికి నేడు శ్రీకారం.. నర్సాపూర్‌లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

Arun Chilukuri
Updated on: 25 Jun 2020 10:48 AM IST
Haritha Haram Program: ఆరో విడుత హరితహారానికి నేడు శ్రీకారం.. నర్సాపూర్‌లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
X

తెలంగాణలో ఆరో విడత హరిత పండుగకు రంగం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ నేడు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటునే.. మొక్కలు నాటాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. ఈ సారి 30 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం సంకల్పించింది. గడిచిన ఐదేళ్లలో మొక్కలు నాటాలనే చైతన్యాన్ని ప్రతి ఒక్కరిలో తీసుకువచ్చింది ప్రభుత్వం.

ఆరో విడత హరిత పండగకు తెలంగాణ సిద్ధమైంది. ప్రతీ ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ పచ్చని పండుగను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జూన్ 25 నుంచి ఆరో విడత హరితహారం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ మొక్కలు నాటేలా ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో హరితహారాన్ని భాగస్వామ్యం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది 30కోట్ల మొక్కలు నాటే లక్ష‌్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో 85 శాతం మొక్కలు తప్పనిసరిగా బతికేలా చర్యలు చేపడుతున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇంటి పరిసరాల్లో నాటిన మొక్కలకు ఇంటి యజమానులే బాధ్యత తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. నిర్లక్యం చేసిన వారికి జరిమానా విధించనున్నట్లు పంచాయతీ రాజ్ చట్టంలో పొందుపరిచారు. ప్రతీ ఒక్కరిలో పర్యావరణపై బాధ్యత పెరిగేలా నిబంధనలు కఠినతరం చేశారు.

గత ఐదు విడతల్లో నాటిన మొక్కలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర మంతటా పచ్చదనం పెరుగుతోంది. రహదారుల వెంట చెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన దేశవ్యాప్త నివేదికలో పచ్చదనం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని స్పష్టం చేసింది. గ్రామాల్లో మొక్కలు నాటే లక్ష్యాన్ని గ్రామ స్థాయి యంత్రాంగం నిర్ధేశించుకునేలా ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ లక్ష్యాలను నిర్ణయించి అమలు చేయనుంది.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ శాఖ అధికారులతో పలు మార్లు సమీక్ష నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల అటవీ అధికారులను అలర్ట్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story