Telangana: తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం..వారికి స్మార్ట్ ఫోన్స్..

Telangana: కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని టీఎస్ ప్రభుత్వం నిర్ణయించింది

Kranthi
Updated on: 12 Jun 2021 1:41 PM IST
Childerns of Covid Victimized Families will get Smart Phones
X

Children of Covid Victimized Families:(The Hans India)

Telangana: కరోనా వేలాది కుటుంబాలకు చీకటిని మిగిల్చింది. అండగా ఉండే కుటుంబ పెద్దలను కబళించేసింది. కొందరు పిల్లలను అనాథలు చేస్తూ తల్లిని, తండ్రిని తీసుకుపోయింది. అలాంటి అనాథ పిల్లలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పథకాలను ప్రకటిస్తున్నారు. కొందరు ఆర్ధిక సాయం.. మరికొందరు చదివించే బాధ్యత ఇలా రకరకాలుగా ఆదుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అయితే ఆ సాయం అందుకోవటానికి గాను పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంచాలని నిర్ణయించింది. కరోనా వలన అనాథలైన పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందించి.. తద్వారా వారు వాటి ద్వారా అధికారులను సంప్రదించి సాయం పొందేలా చేయటమే దీని లక్ష్యం.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు సహాయ పడేందుకు వీలుగా వారికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనాథ పిల్లల భద్రత దృష్ట్యా వారి సమస్యలను అధికారులు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంది. ఈ ఫోన్లలో జిల్లా శిశు సంరక్షణ శాఖ అధికారితోపాటు పలువురు అధికారుల ఫోన్ నంబర్లు, హెల్ప్ లైన్, ఎమర్జెన్సీ నెంబర్లను కాంటాక్ట్ జాబితాలో ఫీడ్ చేసి.. అనాథ పిల్లలకు అందించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు వెల్లడించారు.

ఈ ఫోన్లు తీసుకున్న అనంతరం.. అనాథ పిల్లలు ఏదైనా సాయం కోసం అధికారులను సంప్రదించవచ్చు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు మరణించడంతో 85 మంది పిల్లలు అనాథలయ్యారు. దీంతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన అనాథలు సైతం ఉన్నారని అధికారులు తెలిపారు. మొత్తం 138 మంది అనాథ పిల్లలున్నట్లు గుర్తించామన్నారు. ఈ అనాథ పిల్లలందరికీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నెలవారీగా రేషన్ కిట్స్ అందించాలని నిర్ణయించారు. సంరక్షకులు లేని అనాథ పిల్లలను ఛైల్డ్ హోమ్స్‌లకు తరలించారు. అంతేకాకుండా వీరందరికీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి చదువు చెప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Kranthi

Kranthi

Next Story