CM KCR: నిన్న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కేంద్రమంత్రి సింధియా భేటి

CM KCR: తెలంగాణలో 6 కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తాం : సింథియా

Sandeep Eggoju
Published on: 12 Sept 2021 7:52 AM IST
Central Minister Scindia Meeting With CM KCR in Pragathi Bhavan Yesterday
X

సీఎం కెసిఆర్ తో భేటీ అయిన సిందియా

CM KCR: తెలంగాణలో 6 కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ఆర్‌జీఐఏ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధి కోసం కూడా పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఎయిర్ పోర్టుల సంఖ్య పెంపునకు పని చేస్తామని హామీ ఇచ్చారు.

కేంద్రమంత్రి సింధియా నిన్న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆయనను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. అనంతరం వీరు వివిధ అంశాలపై చర్చించారు. ఆర్థికంగా తెలంగాణ అభివృద్ధి చెందడంతోపాటు, హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్నందున, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి, వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రిని కోరారు. హెల్త్ హబ్‌గా, ఐటీ హబ్‌గా, టూరిజం హబ్‌గా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం విస్తరిస్తుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, పలు అంతర్జాతీయ నగరాల నుండి ప్రయాణికులు వస్తున్నారని గుర్తు చేశారు.

కేసీఆర్ చెప్పిన అంశాలపై స్పందించిన కేంద్రమంత్రి అన్నింటికీ సానుకూలంగా స్పందించారు. భవిష్యత్‌లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతిపాదనలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టుల్లో ఒకటైన వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు అథారిటీ లాండ్, ఏటీఆర్ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టుకు సంబంధించిన టెక్నికల్ క్లియరెన్స్ ఇస్తామన్నారు. అలాగే ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్ నగర్ ఎయిర్ పోర్టుల ఏర్పాటు తగు చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి సింధియా హామీ ఇచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story