పోరాడి ఓడిన సాయి ప్రణీత్

పోరాడి ఓడిన సాయి ప్రణీత్
x
Highlights

తన శక్తికి మించి పోరాడినా.. బలమైన ప్రత్యర్థి ముందు తలవొంచక తప్పలేదు సాయి ప్రణీత్ కి. జపాన్ వరల్డ్ టూర్ సూపర్ - 750 టోర్నీ సెమీఫైనల్ లో ప్రపంచ...

తన శక్తికి మించి పోరాడినా.. బలమైన ప్రత్యర్థి ముందు తలవొంచక తప్పలేదు సాయి ప్రణీత్ కి. జపాన్ వరల్డ్ టూర్ సూపర్ - 750 టోర్నీ సెమీఫైనల్ లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో ఈ టోర్నీ లో భారత్ కథ ముగిసింది.

శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 18–21, 12–21తో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో 11వ ర్యాంకర్‌ నిషిమోటో (జపాన్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 17వ ర్యాంకర్‌ సునెయామ (జపాన్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 18వ ర్యాంకర్‌ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందిన సాయిప్రణీత్‌కు సెమీస్‌లో ఓటమితో 10,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 23 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

కెంటో మొమోటాతో ఐదోసారి తలపడిన సాయిప్రణీత్‌ ఈసారి వరుస గేముల్లో ఓడిపోయాడు. ఏప్రిల్‌లో సింగపూర్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో కెంటో మొమోటాకు మూడు గేమ్‌లపాటు ముచ్చెమటలు పట్టించిన ఈ తెలుగు తేజం ప్రస్తుత పోరులో 45 నిమిషాల్లో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్‌ హోరాహోరీగా సాగినా కీలకదశలో మొమోటా పైచేయి సాధించాడు. ఒకదశలో 6–11తో వెనుకబడిన సాయిప్రణీత్‌ అద్భుత ఆటతో వరుసగా ఐదు పాయింట్లు గెలిచి స్కోరును 11–11తో సమం చేశాడు. కానీ వెంటనే తేరుకున్న మొమోటా వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లాడు.

ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌ ఆరంభంలో సాయిప్రణీత్‌ దూకుడుగా ఆడుతూ 9–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ నిలబెట్టుకోలేకపోయాడు. మొమోటా సాధికారిక ఆటతీరుకుతోడు అనవసర తప్పిదాలు చేసిన సాయిప్రణీత్‌ వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయాడు. 9–12తో వెనుకంజలో నిలిచాడు. ఆ తర్వాత సాయిప్రణీత్‌ కోలుకొని 12–14తో ఆధిక్యాన్ని రెండు పాయింట్లకు తగ్గించాడు. ఈ దశలో మొమోటా ఒక్కసారిగా గేర్‌ మార్చాడు. వరుసగా ఏడు పాయింట్లు సంపాదించి 21–12తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories