ODI World Cup 2023: నేటి నుంచే వన్డే ప్రపంచకప్‌.. 46 రోజుల పండగ.. 10 జట్ల మధ్య పోరు..

ODI World Cup 2023
x

ODI World Cup 2023: నేటి నుంచే వన్డే ప్రపంచకప్‌.. 46 రోజుల పండగ.. 10 జట్ల మధ్య పోరు..

Highlights

ODI World Cup 2023: తొలి పోరులో ఇంగ్లాండ్‌ వర్సెస్ న్యూజిలాండ్‌

ODI World Cup 2023: ఉత్కంఠభరిత పోరాటాలు.. సంచలన ఫలితాలు.. అద్భుత ప్రదర్శనలు.. మరపురాని ఘట్టాలు.. ఎన్నో! దాదాపు అయిదు దశాబ్దాలుగా వేర్వేరు తరాల క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగిస్తూ వన్డే ప్రపంచకప్‌ పంచిన మధుర జ్ఞాపకాలు ఎన్నెన్నో! క్రికెట్‌ అభిమానులకు ఎంతో ఇష్టమైన, ఆటగాళ్లకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ మెగా టోర్నీ మళ్లీ వచ్చేసింది. ఈసారి ప్రపంచకప్‌ జరిగేది మన గడ్డపైనే. ఈ క్రికెటోత్సవానికి శ్రీకారం గురువారమే. 1983లో ఇంగ్లాండ్‌ గడ్డపై కపిల్‌ డెవిల్స్‌ చరిత్ర సృష్టించింది. భారత్‌కు మొట్టమొదటి ప్రపంచకప్‌ అందించి.. దేశంలో క్రికెట్‌కు రాకెట్‌ వేగాన్ని అందించింది. 28 ఏళ్ల తర్వాత.. 2011లో ధోనీసేన మరోసారి వన్డే విశ్వవిజేతగా నిలిచి దేశాన్ని క్రికెట్‌ మైకంతో ఊపేసింది. ఇప్పుడు రోహిత్‌ బృందం కూడా అద్భుత ప్రదర్శనతో భారత్‌ను మరోమారు విజేతగా నిలపాలని.. ‘మూడో కప్పు’ ముచ్చట తీర్చాలని అభిమానుల ఆకాంక్ష.

నాలుగేళ్ల నిరీక్షణ ముగిసింది. కోట్లాది అభిమానుల ఎదురుచూపులకు ఇక తెరపడనుంది. వన్డే వరల్డ్‌కప్‌ 46 రోజుల పాటు ప్రపంచాన్ని ఊపేసేందుకు సిద్ధమైంది. ప్రతీ క్రికెటర్‌ ఒక్కసారైనా ఆడాలనుకునే మెగా ఈవెంట్‌ ఇది. ప్రతీ జట్టు చాంపియన్‌గా పిలిపించుకోవాలనే వేదిక. ఇందుకోసం అత్యుత్తమ పది జట్లు మైదానంలో చిరుతల్లా పోటీపడేందుకు సిద్ధమవబోతున్నాయి. ఆద్యంతం ఉత్కంఠను రేపే పోరాటాలు. సూపర్ షాట్లతో అలరించే బ్యాటింగ్‌ విన్యాసాలు.. స్వింగ్‌, పేస్‌, స్పిన్‌లతో ప్రత్యర్థి వికెట్లను ఫట్‌మని ఎగరగొట్టేసేందుకు బౌలర్ల ప్రయత్నాలు.. కన్నుమూసి తెరిచేలోపే బంతిని పట్టేసి బ్యాట్స్‌మెన్‌కు పెవిలియన్‌ దారి చూపే మెరుపు ఫీల్డర్ల చమక్కులు.. ఇలా.. నవంబరు 19 వరకు అందరికీ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.

అన్నింటికీ మించి సొంత గడ్డపై టీమిండియా మూడో ప్రపంచక్‌పను ముద్దాడి కోట్లాది భారతీయులను మురిపించాలని పంతంతో ఉంది. ఇప్పుడంటే పొట్టి ఫార్మాట్‌లోనూ మెగా టోర్నీ వచ్చేసింది కానీ.. ఒకప్పుడు క్రికెట్‌ లవర్స్ కు వరల్డ్‌కప్‌ అంటే ఒక్కటే. అదే వన్డే వరల్డ్‌కప్‌. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవారు. ఒలింపిక్స్‌, ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌క్‌పలకు ఏమాత్రం తగ్గనిదీ మెగా టోర్నమెంట్‌. టెస్టుల్లోనూ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప వచ్చేసినా.. వన్డే వరల్డ్‌క్‌పనకు మాత్రం ఫ్యాన్స్‌ నుంచి అదే ఆదరణ.. అదే ఆసక్తి కనిపిస్తోంది.

తాజాగా 13వ ప్రపంచకప్‌ నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. పుష్కరకాలం తర్వాత భారత్‌ తిరిగి ఆతిథ్యమివ్వడం క్రికెట్‌ ప్రేమికులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. అలాగే తొలిసారిగా భారత్‌ ఈ టోర్నీని సొంతంగా నిర్వహిస్తోంది. 1987, 1996, 2011లో పొరుగు దేశాలతో భాగస్వామ్యమైంది. మొత్తం 46 రోజుల పాటు వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఇందులో 43 రోజులు గ్రూప్‌ మ్యాచ్‌లు జరుగనుండగా.. తర్వాత రెండు సెమీ్‌సలు, ఫైనల్‌ ఉంటాయి. నవంబరు 19న అహ్మదాబాద్‌లోనే టైటిల్‌ పోరు జరుగుతుంది. ఇక ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇందుకు వేదిక కానుంది.

స్వదేశీ అభిమానుల మద్దతుతో భారత జట్టు వరల్డ్‌క్‌పలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో మేజర్‌ టోర్నీల్లో భారత్‌ తడబడుతూ చోకర్స్‌గా ముద్ర వేయించుకుంటోంది. ఈసారి ఆ అడ్డంకిని దాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో దక్షిణాఫ్రికా జట్టును ఇదే రీతిన పిలిచేవారు. 2013 చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాక మరే మేజర్‌ టోర్నీ గెలవకపోవడంతో ఇప్పుడా పేరు భారత జట్టుకు మారింది. జట్టులో బాగా ఆడే ప్లేయర్స్ కు కొదువలేదు. పైగా వన్డేల్లో నెంబర్‌వన్‌ జట్టుగా టోర్నీలో అడుగుపెట్టనుంది. భారత్‌ ఆడాల్సిన రెండు వామప్‌ మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. ఇక ప్రధాన మ్యాచ్‌ల్లో భాగంగా 8న ఆస్ట్రేలియాతో టైటిల్‌ వేటను ఆరంభించనుంది. గిల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండడం రాహుల్‌, శ్రేయాస్‌ ఫిట్‌నె్‌సను నిరూపించుకోవడంతో పాటు రోహిత్‌, విరాట్‌ల అనుభవం జట్టుకు కలిసిరానుంది. అయితే టెయిలెండర్లు కాస్త బ్యాట్లను ఝుళిపిస్తే ప్రయోజనం ఉంటుంది.

క్రికెట్‌ అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ.. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 2019 ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో మొదలు కాబోతోంది. ఈ రెండు జట్లూ ప్రపంచకప్‌ ఫేవరెట్ల జాబితాలో ఉన్నాయి. దూకుడుకు మారుపేరైన ఇంగ్లాండ్‌ను మరోసారి హాట్‌ ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. సొంతగడ్డపై భారీ అంచనాలతో దిగుతున్న టీమ్‌ఇండియాకు ప్రధాన ముప్పుగా భావిస్తున్నారు. అయిదు టైటిళ్లతో ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఎప్పట్లాగే గట్టి పోటీదారే. అంచనాలకు అందని ఆటతీరుతో ఆశ్చర్యపరిచే పాకిస్థాన్‌ అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. 2019 ఫైనల్లో కప్పు కోసం తుదికంటా అద్భుతంగా పోరాడిన ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య ఈసారి తొలి పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.

ఆరంభం ఎవరిదో?:

ప్రపంచకప్‌ ఆసక్తికర పోరుతో మొదలవుతోంది. గత టోర్నీ ఫైనలిస్టులు ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కాస్త ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. కివీస్‌ను తక్కువగా అంచనా వేయలేం. ప్రపంచకప్‌ ముంగిట ఈ రెండు జట్ల మధ్య జరిగిన సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 3-1తో నెగ్గినప్పటికీ.. మ్యాచ్‌లు హోరాహోరీగానే సాగాయి. కాన్వే, యంగ్‌, ఫిలిప్స్‌, మిచెల్‌, బౌల్ట్‌, సౌథీ, రచిన్‌ రవీంద్ర, ఇష్‌ సోధి లాంటి ఉత్తమ ఆటగాళ్లతో కివీస్‌ బలంగా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్‌ జట్టులో ఎక్కువమంది విధ్వంసక బ్యాటర్లే. బెయిర్‌స్టో, మలన్‌, రూట్‌, బ్రూక్‌, లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, బట్లర్‌లతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ను చూసి ఏ జట్టయినా భయపడాల్సిందే. విల్లీ, సామ్‌ కరన్‌, టాప్లీ, రషీద్‌, వోక్స్‌లతో బౌలింగ్‌ కూడా బలంగా ఉంది.

ఆ నాలుగు జట్లు ఏవో?

కప్పు ఎవరు గెలుస్తారన్న దానికంటే ముందు సెమీస్‌ చేరే జట్లేవన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నెదర్లాండ్స్‌ టోర్నీలో ఒక్క విజయం సాధించినా సంచలనమే అవుతుంది. బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ రెండు మూడు మ్యాచ్‌లు నెగ్గితే నెగ్గొచ్చు కానీ.. సెమీస్‌ చేరడం దాదాపు అసాధ్యం. శ్రీలంక ఇటీవల మెరుగుపడ్డప్పటికీ.. పెద్ద జట్లను దాటి ముందంజ వేయడం కష్టమే. నాలుగు బెర్తుల కోసం మిగతా 6 జట్ల మధ్యే ప్రధానంగా పోటీ ఉండవచ్చు. భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సెమీస్‌ చేరతాయని ఎక్కువమంది భావిస్తున్నారు. న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా కూడా సెమీస్‌ రేసులో ఉన్నాయి.

ఫార్మాట్‌ ఇదీ..

2019లో మాదిరే ఈసారి కూడా టోర్నీలో పది జట్లే పోటీ పడుతున్నాయి. ఐసీసీ ర్యాకింగ్స్‌లో టాప్‌-8 జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. అర్హత టోర్నీ ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్‌ టోర్నీలో అడుగు పెట్టాయి. పది జట్లలో ప్రతి జట్టూ మిగతా 9 జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ దశ ముగిసేసరికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

13 ఇప్పుడు జరుగుతున్న ప్రపంచకప్‌ సంఖ్య.

1 భారత్‌ పూర్తిస్థాయిలో ఆతిథ్యమిస్తున్న తొలి ప్రపంచకప్‌ ఇదే. 1987లో పాకిస్థాన్‌తో, 1996లో పాకిస్థాన్‌, శ్రీలంకతో, 2011లో బంగ్లాదేశ్‌, శ్రీలంకలతో కలిసి భారత్‌ ప్రపంచకప్‌ నిర్వహించింది.

10 ఈ సారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జట్లు. ఆతిథ్య భారత్‌తో పాటు అఫ్గానిస్థాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక కప్పు కోసం పోటీపడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories