మొహాలీ టెస్టులో భారత్ ఘన విజయం.. శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా..

IND vs SL: శ్రీలంకతో జరిగిన టెస్టు క్రికెట్లో టీమిండియా ఘనవిజయం సాధించింది.

Arun Chilukuri
Published on: 6 March 2022 4:57 PM IST
IND Won by an Innings and 222 Runs
X

మొహాలీ టెస్టులో భారత్ ఘన విజయం.. శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 

IND vs SL: శ్రీలంకతో జరిగిన టెస్టు క్రికెట్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆడిన మ్యచ్ లో 574 పరుగులతో టీమిండియా డిక్లేర్ చేసింది. తొలిరోజు ఆటలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన రిషబ్ పంత్ శతకానికి చేరువయ్యే క్రమంలో 96 పరుగుల వద్ద పెవీలియన్ బాట పట్టాడు. రవీంద్ర జడేజా, హనుమవిహారి, రవిచంద్ర అశ్విన్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. 45 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీకి ఇది వందో టెస్ట్ మ్యాచ్, ఇదే మ్యాచ్ లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 228 బంతులు ఎదుర్కొన్న జడేజా 17 బౌండరీలు, 3 సిక్సర్లతో 175 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అంతకు ముందురోజు క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ 97 బంతులు ఎదుర్కొని 9 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో చెలరేగిపోయాడు. 96 పరుగులవద్ద నిరాశగా పెవీలియన్ బాటపట్టాడు. రవిచంద్ర అశ్విన్ 61 పరుగులు, హనుమవిహారి 58 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు అందించారు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లుగా బరిలో దిగిన రోహిత్ శర్మ 29 పరుగులు, మయాంక్ అగర్వాల్ 33 పరుగుల నమోదు చేశారు.

తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 65 ఓవర్లలో 174 పరుగులకే చేతులెత్తేసింది. రెండో ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక 60 ఓవర్లు ఎదుర్కొని 178 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఒకే ఇన్నింగ్స్ తో 222 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతోపాటు, 9 వికెట్లను చేజిక్కించుకుని శ్రీలంకపై సాధికార విజయాన్ని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story