కేంద్రం మరో సంచలనం ; పాక్‌కు వెళ్ళిపోయిన కశ్మీరీలకు తలుపులు మూసివేత

కేంద్రం మరో సంచలనం ; పాక్‌కు వెళ్ళిపోయిన కశ్మీరీలకు తలుపులు మూసివేత
x
Highlights

ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తరువాత మరో సాహసోపేత నిర్ణయం తీసుకుంది కేంద్రం. 1947 నుంచి 1954 మధ్య కాలంలో పాకిస్థాన్ కు వెళ్ళిపోయిన కశ్మీరీలు, వారి...

ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తరువాత మరో సాహసోపేత నిర్ణయం తీసుకుంది కేంద్రం. 1947 నుంచి 1954 మధ్య కాలంలో పాకిస్థాన్ కు వెళ్ళిపోయిన కశ్మీరీలు, వారి వారసులు తిరిగి కశ్మీర్ కు వచ్చేందుకు వీలు కల్పించే చట్టాన్ని కేంద్రం రద్దు చేసింది. అందుకు జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఆయుధంగా చేసుకుంది. ఈ చట్టం కింద రద్దయిన 153 రాష్ట్ర చట్టాలు, గవర్నర్ చర్యల్లో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న చట్టం కూడా ఉంది. 37 ఏళ్ళ క్రితం నాటి ఈ చట్టం రద్దు కావడం కశ్మీర్ చరిత్రలో ఓ పెద్ద సంచలనం. దానిపై మాట్లాడుకునేందుకు ముందు అసలు ఈ చట్టమేంటో చూద్దాం.

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ 1982లో ఓ ప్రైవేటు బిల్లును ఆమోదించింది. ఆ చట్టం ప్రకారం 1947 మార్చి 1 నుంచి 1954 మే 14 వరకు కశ్మీర్ నుంచి పాకిస్థాన్ కు వలస వెళ్ళిపోయిన వారు, వారి వారసులు జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో తిరిగి సెటిల్ అయ్యేందుకు అంటే పాకిస్థాన్ నుంచి శాశ్వతంగా తిరిగి వచ్చేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కింద వర్తించేలా ఈ చట్టాన్ని 1982 ఆగస్టు 5న భారత పార్లమెంట్ కూడా ఆమోదించింది.

నిజానికి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడే బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పాంథర్స్ పార్టీ లాంటి పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, కొన్ని ఇతర చిన్న పార్టీలు మాత్రం ఈ బిల్లును సమర్థించాయి. దాంతో దాన్ని తొమ్మిది మంది సభ్యుల సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఆ కమిటీ ఆమోదంతో అది చట్టంగా మారింది. అప్పట్లో రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బి.కె నెహ్రూ 1982 సెప్టెంబర్ 18న ఆ బిల్లును పున: పరిశీలించాలంటూ అసెంబ్లీకి తిప్పిపంపించారు. అప్పటి కశ్మీర్ చట్టసభలు 1982 అక్టోబర్ 6న ఆ చట్టాన్ని ఎలాంటి మార్పులు లేకుండా మరోసారి ఆమోదించాయి. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్ దాన్ని ఆమోదించాల్సి వచ్చింది. దాన్ని అడ్డుకునేందుకు అప్పట్లో కేంద్రం ప్రయత్నించినా లాభం లేకపోయింది.

అప్పట్లో కేంద్రం ఈ చట్టాన్ని రాష్ట్రపతి ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నించింది. నాటి రాష్ట్రపతి జైల్ సింగ్ ఈ చట్టం విషయంలో సుప్రీం కోర్టుకు నివేదించారు. ఆ బిల్లు లేదంటే ఆ బిల్లు లోని అంశమేదైనా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నదేమో చెప్పాల్సిందిగా కోరారు. ఆ కేసును సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించింది. తన అభిప్రాయం వెల్లడించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. రిటర్న్డ్, రెస్పెక్ట్ ఫుల్లీ, అన్ ఆన్సర్డ్ అంటూ మూడే మూడు పదాలతో దాన్ని రాష్ట్రపతికి తిప్పిపంపింది. అయితే ఆ చట్టం కార్యరూపం దాల్చడంపై మాత్రం స్టే విధించింది. అప్పట్లోనే అంటే 1982లోనే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నేషనల్ పాంథర్స్ పార్టీ, బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై 19 ఏళ్ళ పాటు సుప్రీం కోర్టు మౌనంగానే ఉండిపోయింది.

2016లో మరో సారి ఈ చట్టం సుప్రీం కోర్టు పరిశీలనకు వచ్చింది. వారసులు గాకుండా వలస వెళ్ళిన వారు మాత్రం తిరిగి రావడాన్ని పరిశీలించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అసలు ఈ చట్టం కింద భారత్ కు తిరిగి వచ్చేందుకు వలస వెళ్ళిన వారిలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని 2018 డిసెంబర్ లో సుప్రీం కోర్టు ఆరా తీసింది. ఈ చట్టం కింద ఏర్పాటు చేయాల్సిన సాధికారిక సంస్థను ఏర్పాటు చేయకపోవడంతో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. సుప్రీం ప్రశ్నకు 2019 జనవరి 7న రాష్ట్రప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆ చట్టం కింద ఒక్క దరఖాస్తు కూడా రాలేదని స్పష్టంచేసింది. మరో వైపున కేంద్రం కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించింది. దేశభద్రతకు ముప్పు కలుగుతుందని చెప్పింది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇక తాజాగా కశ్మర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద రీసెటిల్ మెంట్ యాక్ట్ ను రద్దు చేసింది.

రీసెటిల్ మెంట్ చట్టం రద్దు కావడంతో పాకిస్థాన్ నుంచి కశ్మీరీయులు తిరిగి కశ్మీర్ లో సెటిల్ అయ్యేందుకు తలుపులు మూసుకుపోయినట్లే అయింది. రీసెటిల్మెంట్ చట్టం ఇక ముగిసిన అధ్యాయంగా మారింది. బీజేపీ భాషలో చెప్పాలంటే, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం భారత్ తో మరింతగా కలసిపోయింది. ఏమైతేనేం పాకిస్థాన్ తో కశ్మీర్ కు ఉండిన ఒక్కో అనుబంధాన్ని తెంచివేయడం ద్వారా కేంద్రం కశ్మీర్ పై తన పట్టు మరింతగా బిగిస్తోంది. కాకపోతే దీనిపై ఎలాంటి వ్యతిరేకత వస్తుందో చూడాలి. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ ను వేరు చేసిన డిసెంబర్ 16ను భారత్ విజయ్ దివస్ గా పాటిస్తోంది. సరిగ్గా ఇదే సందర్భంలో ఒకప్పటి కశ్మీర్ చట్టాన్ని కేంద్రం రద్దు చేసినట్లుగా వార్తలు రావడం మరో విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories