తెలుగు రాష్ట్రాల్లో ఆ జిల్లాల్లో లాక్ డౌన్ సడలిస్తారా? ఆశతో చూస్తున్న ప్రజలు!
కంటికి కనిపించని మహమ్మారి కరోనా ఇటు ప్రభుత్వాలకూ, అటు ప్రజలకూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కల్లోలాన్ని అతిక్రమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశమంతా స్తంభింప చేశారు. లాక్ డౌన్ తో ఎక్కడి వారక్కడ ఉండిపోయారు. దీంతో ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ సడలించాలంటూ చాలా మంది కోరుతున్నారు. అయితే, ప్రజా సంక్షేమం దృష్ట్యా మరి కొన్ని రోజుల పాటు లాక్దౌన్ కొనసాగుతుందని ప్రధాని మోడీ నిన్న ప్రకటించారు.
ఇదే సందర్భంలో ఏప్రిల్ 20 తరువాత కొన్ని చోట్ల లాక్ డౌన్ సడలింపు పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనీ ప్రధాని చెప్పారు. ఇప్పుడు ఈ కోణంలో దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు తమకు ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. దేశంలో దాదాపు 350 జిల్లాల్లో ఒక్క కోవిడ్ కేసూ నమోదు కాలేదు. వాటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపి నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, తెలంగాణ నుంచి మంచిర్యాల, వరంగల్(రూ),యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో ప్రజలు తమ దైనందిన జీవితాలు యధావిధిగా గడిపేందుకు వీలుగా ఆయా జిల్లాల పరిధిలో లాక్ డౌన్ నిబంధనలు సడలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క కేసూ నమోదు కాని ఆ జిల్లాల్లో కరోనా వ్యాపించే అవకాశం లేనందున కొన్ని షరతులతో లాక్ డౌన్ నుంచి మునహాయింపు ఇవ్వొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆవిధంగా చేయడం ద్వారా ఆయా జిల్లాల్లో వ్యవసాయం, ఇతర పనులు చేసుకోవడానికి ప్రజలకు వెసులుబాటు కలుగుతుందనీ తద్వారా వారు ఆర్ధిక ఇబ్బందుల నుంచి కొంత వరకూ గట్టెక్కే అవకాశాలున్నయనీ ఆ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఒక్క కేసూ నమ్దౌ కాని జిల్లాల ప్రజలు ఏప్రిల్ 20 వ తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.




