Chief Justice of India 2021: దేశ సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం

Chief Justice of India 2021: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ ప్రమాణం

Sandeep Eggoju
Updated on: 24 April 2021 12:03 PM IST
N V Ramana as the 48th Chief Justice of India
X
ఎన్ వీ రమణ (ఫైల్ ఫోటో)

Chief Justice of India 2021: తెలుగుజాతి ఖ్యాతిని మరింతగా చాటుతూ దేశ సర్వోన్నత న్యాయపీఠాన్ని జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ అధిష్ఠించనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమణ భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో శనివారం జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జస్టిస్‌ ఎన్​వీ రమణతో ప్రమాణం చేయిస్తారు.

ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్​ఏ బోబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ఈ మేరకు శనివారం.. దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్​వీ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా సీజేఐ పదవిని చేపట్టే రెండో తెలుగు వ్యక్తిగా ఆయన నిలుస్తారు. రాజమహేంద్రవరానికి చెందిన.. జస్టిస్ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ సుబ్బారావు తర్వాత సీజేఐ పదవికి ఎదిగిన రెండో వ్యక్తిగా జస్టిస్ రమణ నిలిచారు.

సంప్రదాయం ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు తమ పదవీ విరమణకు నెల రోజుల ముందే తదుపరి సీజేఐ పేరును కేంద్రానికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా మార్చి 24న జస్టిస్ బోబ్డే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేరును ప్రతిపాదించారు. సీజేఐ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ.. కేంద్ర హోంశాఖకు పంపింది. అక్కడ పరిశీలన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి చేరగా రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ భారత 48వ సీజేఐగా జస్టిస్ ఎన్​వీ రమణను నియమిస్తూ ఈనెల 6న ఉత్తర్వులు జారీచేసింది.జస్టిస్ రమణ 2022 ఆగస్టు 26 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story