Army Dog: జవాన్‌‌ను కాపాడేందుకు.. ఉగ్రవాదులకు ఎదురెళ్లిన డాగ్.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిందంటూ ఆర్మీ ట్వీట్..!

Labrador Female Army Dog Lost Life Protecting Soldier During Jammu Kashmir Rajouri Encounter
x

Army Dog: జవాన్‌‌ను కాపాడేందుకు.. ఉగ్రవాదులకు ఎదురెళ్లిన డాగ్.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిందంటూ ఆర్మీ ట్వీట్..!

Highlights

Army Dog: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Army Dog: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చగా, ఒక ఆర్మీ జవాను వీరమరణం పొందాడు. దీనితో పాటు భారత ఆర్మీకి చెందిన కెంట్ (Kent) అనే కుక్క కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించింది. సైనికుడిని కాపాడే క్రమంలో ప్రాణాలు విడిచింది.

కెంట్ సెర్చ్ ఆపరేషన్‌లో సైన్యానికి సహాయం చేస్తుంది. అలాగే ఉగ్రవాదులను వెతకడానికి సైనికులకు సహాయం చేస్తుంది. ‘ఆపరేషన్‌ సుజలిగాల’లో భాగంగా కెంట్‌ను సైన్యానికి సహాయం చేసేందుకు తీసుకెళ్లారు. అయితే, ఒక దట్టమైన పొద దగ్గర సైనికుల బృందం నిలిచింది. ఇదే సమయంలో ఉగ్రవాదులను గుర్తించిన కెంట్.. సైన్యానికి సిగ్నల్స్ ఇచ్చింది. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఓ భారత జవాన్‌ను ఉగ్ర మూకలు చుట్టుముట్టాయి. ఇది గమనించిన కెంట్ ఉగ్రవాదులకు ఎదురుగా వెళ్లింది. ఉగ్రవాదుల కాల్పులు చేయడంతో కెంట్ అక్కడిక్కడే మరణించింది.

కెంట్ చేసిన త్యాగాన్ని భారత సైన్యం గుర్తు చేసుకుంటూ నివాళుల అర్పిస్తూ ఎక్స్‌‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘ఇది ఎంతో విచారకరం. లాబ్రడార్‌ జాతికి చెందిన ఆడ కుక్క (కెంట్) 21వ ఆర్మీ డాగ్‌ యూనిట్‌కు చెందింది. జవాన్ ప్రాణాలను కాపాడే క్రమంలో ప్రాణాలను కోల్పోయింది. దేశం కోసం గొప్ప త్యాగం చేసిందంటూ’ ట్వీట్ చేసింది.

ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను వీరమరణం పొందగా, ముగ్గురు గాయపడ్డారు..

రాజౌరీ జిల్లాలోని నార్లా ప్రాంతంలో ఓ ఉగ్రవాది హతమైనట్లు జమ్మూ జోన్ ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. ఇది కాకుండా, ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాను కూడా వీరమరణం పొందాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసు ఎస్పీతో పాటు మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

డిఫెన్స్ PRO ప్రకారం, భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టడంతో వారు కాల్పులు ప్రారంభించారు. ఆ తర్వాత ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ భద్రతా దళాల బృందంతో పాటు 21 ఆర్మీ డాగ్ యూనిట్లు ఉన్నాయి. ఇటీవల, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. వాటిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు.


Show Full Article
Print Article
Next Story
More Stories