Farmers Protest: సరిహద్దులో రణరంగం

Farmers Protest: ఆందోళనకారులపైకి బాష్పవాయువు, జల ఫిరంగులు

Jyothi
Published on: 14 Feb 2024 8:48 AM IST
Delhi Chalo Farmers March High tension
X

Farmers Protest: సరిహద్దులో రణరంగం

Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు ఇతర డిమాండ్ల సాధనకు దాదాపు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్నదాతలు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లపై ర్యాలీగా బయలుదేరిన వేలాది మంది రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పంజాబ్, హరియాణా శంభు సరిహద్దులో పోలీసులపై నిరసనకారుల రాళ్ల దాడులు, బారికేడ్ల విధ్వంసం, రైతన్నలపై బాష్పవాయువు ప్రయోగం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువుతోపాటు జల ఫిరంగులు ప్రయోగించారు. దాదాపు 100 మంది రైతులు గాయపడ్డారని రైతు సంఘాల నాయకులు చెప్పారు. శంభు బోర్డర్‌ వద్ద రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. మరోవైపు ఢిల్లీ శివార్లలోని సింఘు, చిల్లా, తిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్‌ పాయింట్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పార్లమెంట్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాలన్న రైతు సంఘాల ప్రణాళిక అమలు కాలేదు.

శంభు సరిహద్దు వద్ద ట్రాక్టర్ల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రైతులను ముందుకు వెళ్లనివ్వలేదు. చలో ఢిల్లీకి అనుమతి లేదని, వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వంతెనపై బారికేడ్లను నదిలోకి తోసేశారు. సిమెంట్‌ బారికేడ్లను ట్రాక్టర్లతో తొలగించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు జల ఫిరంగులు, డ్రోన్లతో బాష్పవాయు గోళాలు ప్రయోగించి రైతులను చెదరగొట్టారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story