దేశంలో పెరుగుతూనే ఉన్న కరోనా కేసులు.. 24 గంటల్లో 28 మంది మరణం!
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు(16 ఏప్రిల్) సాయంత్రం వరకూ దేశంలో 826 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మొత్తమ్మీద దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరుకుంది. మరోవైపు కరోనా కారణంగా గత 24 గంటల్లో 28 మంది మరణించారు. దీంతో ఈ సంఖ్య 420 కి చేరుకుంది. ఇక ఇప్పటివరకూ 1514 మంది కరోనా వైరస్ బారిన పది కోలుకున్నట్టు అధికారులు తెలిపారు.
అదేవిధంగా దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 2919 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య వెల్లడించింది. 187 మంది మరణించగా.. 295 మంది కోలుకున్నట్లు పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లో ముంబయి నగరంలో 107 మంది ఈ మహమ్మారి బారిన పడినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ముగ్గురు మృత్యువాత పడ్డారని తెలిపింది. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2043కు చేరింది. ఇప్పటి వరకు 116 మంది ఒక్క ముంబయి నగరంలో మరణించారు.




