మరోసారి మారిన ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్

Arun Chilukuri
Published on: 27 Nov 2020 6:06 PM IST
మరోసారి మారిన ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్
X

ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ మరోసారి మారింది. రేపు ఒక్కరోజే మూడు నగరాల్లో ప్రధాని పర్యటించనున్నారు. ప్రధాని టూర్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించిన పీఎంవో రేపు అహ్మదాబాద్, హైదరాబాద్‌, పుణెలో మోడీ పర్యటిస్తారని తెలిపింది. ఇక, రేపు మధ్యాహ్నం హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ భారత్ బయోటెక్‌‌ కంపెనీలో కరోనా వ్యాక్సిన్‌ తయారీ, పురోగతిని సమీక్షించనున్నారు.

రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో హకీంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు ప్రధాని. ఆ తర్వాత అక్కడ్నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్తారు. ఇక, ప్రధాని మోడీ పర్యటన కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. హకీంపేట నుంచి భారత్ బయోటెక్ కంపెనీ వరకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీపై మాక్ డ్రిల్స్ సైతం నిర్వహించారు.

అయితే, ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన ఆకస్మికంగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్‌ ప్రక్రియను ప్రధాని మోడీ వ్యక్తిగతంగా పరిశీలించి సమీక్షించడానికి వస్తున్నట్లు పీఎంవో ప్రకటించింది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలవేళ మోడీ నగరానికి వస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. GHMC ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. బీజేపీ ముఖ్యమంత్రులు, కీలక నేతలతో గ్రేటర్లో ప్రచారం చేయిస్తోంది. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా హైదరాబాద్ వస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. హైదరాబాద్ పర్యటనలో గంటపాటు గడపనున్న ప్రధాని మోడీ రాష్ట్ర బీజేపీ నేతలతోనూ సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. అలాగే, GHMC ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు మోడీ పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story