ఆత్మ నిర్భర్ భారత్ : చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు భారీ ఊరట!
కరోనా కష్టాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే లాక్ డౌన్ తో పారిశ్రామికంగా దేశంలో ఎంతో నష్టం వాటిల్లింది. నిన్న ప్రధాని మోడీ 20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు. ఈరోజు (మే13) ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ప్యాకేజీకి సంబంధిన అంశాలను వివరించారు. ఆత్మ నిర్భర్ భారత్ గా ప్రధాని మోడీ పేర్కొన్న ఆ భారీ ప్యాకేజీలోని కొన్ని అంశాలను ఆర్ధిక మంత్రి వెల్లడించారు.
చిన్న మధ్య తరగతి పరిశ్రమలు కరోనా విపత్తుతో పూర్తిగా కుదేలయ్యాయి. అందుకోసం వాటిని ఆదుకోవడానికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ''సూక్ష్మ, మధ్య, లఘు, కుటీర పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)కు రూ.3లక్షల కోట్లు ఎలాంటిపూచీకత్తు లేకుండా రుణాలిస్తాం. 12 నెలల మారటోరియంతో ఈ రుణాలు మంజూరుచేస్తాం. ఎంఎస్ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఇవాళ్టి నుంచి ఒక్కొక్కటిగా వివరాలను ప్రకటిస్తాం. రూ.5లక్షల లోపు ఆదాయ పన్ను రీఫండ్ బకాయిలు వెనక్కి చెల్లించాం. భారత్ స్వయం శక్తితో ఎదగాలనేదే మా లక్ష్యం'' అని ఆర్ధిక మంత్రి తెలిపారు.
ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం రూ.10వేల కోట్లతో ఫండ్ ఏర్పాటు చేస్తారని ఆమె చెప్పారు. మొత్తమ్మీద ఎంఎస్ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం చేకూరనుంది. ఎంఎస్ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఇది దోహదపడుతుంది. ఉద్యోగుల భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుంది. అన్ని విభాగాల్లోనూ నగదు లభ్యతే ప్రధాన సమస్యగా ఉంది. తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.20వేల కోట్లు కేటాయిస్ఎంతాం. అదేవిధంగా ఎస్ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయించనున్నామని ఆర్ధిక మంత్రి వివరించారు. ఇక ఈ ప్యాకేజీతో రెండు లక్షల చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలగనుంది.




