Corona Virus: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

Corona Virus: మొన్న కేరళ.. నిన్న మహారాష్ట్ర, ఇవాళ ఢిల్లీలో భారీగా కేసులు

Sandeep Eggoju
Updated on: 27 Feb 2021 11:10 AM IST
Again Corona Virus Spreading in India
X

Representational Image

Coronavirus: మొన్న కేరళ, నిన్న మహారాష్ట్ర, ఇవాళ ఢిల్లీ కరోనా తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ విజృంభిస్తోంది. కేసులు ఒక్కసారిగా పెరగడం భయాందోళనకు గురి చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒక్కో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో కేంద్రం అప్రమత్తం అయింది. రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. టెస్ట్‌లను పెంచి.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కూడా పెంచాలంటూ కేంద్రం సూచించింది. అయితే కొత్తగా నమోదు అవుతున్న కేసులు కొత్త వైరస్‌ లేదంటే స్ట్రెయిన్ అనేది తెలాల్సి ఉందంటున్నారు. ముఖ్యంతా ఏడు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోందని ఆ రాష్ట్రాల్లో 90శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.

కరోనాను ఓడించినట్లు ఘనంగా ప్రకటించుకున్న దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొమ్మిది నెలల అత్యల్ప సంఖ్యలో ఈ నెల 16న ఢిల్లీలో 94 కేసులు నమోదు అయ్యాయి.. గత మూడు రోజుల నుంచి వైరస్ ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. పాజిటివ్ కేసులు పెరుగుతూ వచ్చాయి. శుక్రవారం 256 మందికి కరోనా సోకింది. అంతా బాగుందని భావిస్తున్న ప్రజలు నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారని, తాజా పరిణామాలు ప్రమాద ఘంటికేనని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా వైరస్‌ బారిన పడిన వారిలో ఎక్కువ శాతం ప్రయాణాలు చేసి వారేనని గుర్తించారు. అంతేకాదు పెళ్లిళ్లు, సామూహిక కార్యక్రమాలకు హాజరైన వారేనని పేర్కొంటున్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా శుక్రవారం కొత్తగా 8లక్షల మందికి టీకా వేసినట్టు కేంద్రం తెలిపింది. దీంతో కలిపి కోటి 34లక్షల మందికి టీకా ఇచ్చినట్టు వెల్లడించింది. వీరిలో 66 లక్షలకు పైగా మంది ఆరోగ్య కార్యకర్తలకు తొలిడోసు, 20లక్షలకు పైగా మందికి రెండో డోసు.. 48 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి డోసు వేసినట్టు పేర్కొంది.


మరోవైపు ప్రస్తుతం ఉన్న కోవిడ్ నియంత్రణ మార్గదర్శకాలు మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మార్చి 31 అంతర్జాతీయ విమానాలు రద్దు పొడిగించారు. ఇప్పటికే ఇచ్చిన 50శాతం సీటింగ్ సామర్ధ్యంలో సినిమా హాళ్ల నిర్వహణను పెంచే అవకాశం ఉంది. స్విమ్మింగ్ ఫూల్స్‌లో ఇప్పటి వరకు క్రీడాకారులకే అనుమతి ఉండగా.. ఇకపై అందరికీ ప్రవేశం ఇవ్వనున్నారు. మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రారంభంకానుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story