హీరో విలన్లుగా మళ్లీ మెరవనున్న చిరంజీవి - మోహన్ బాబు

హీరో విలన్లుగా మళ్లీ మెరవనున్న చిరంజీవి - మోహన్ బాబు
x
Highlights

చిరంజీవి-మోహన్ బాబు ఈ ఇద్దరి పేర్లూ వింటేనే.. తెలుగు ప్రేక్షకులకు ఒకరకమైన ఫీలింగ్స్. ఇద్దరూ స్నేహితులో.. శత్రువులో అర్థంకాని అయోమయం. ఆఫ్ స్క్రీన్...

చిరంజీవి-మోహన్ బాబు ఈ ఇద్దరి పేర్లూ వింటేనే.. తెలుగు ప్రేక్షకులకు ఒకరకమైన ఫీలింగ్స్. ఇద్దరూ స్నేహితులో.. శత్రువులో అర్థంకాని అయోమయం. ఆఫ్ స్క్రీన్ ఇద్దరి మధ్య దశాబ్దాలుగా ఇటువంటి అనుబంధమే కొనసాగుతోంది. అప్పుడే ఇద్దరూ పబ్లిక్ లోనే ఒకరిని ఒకరు మాటలు విసిరేసుకుంటారు. అంతలోనే మళ్ళీ ఇద్దరూ ఒకటే అనే రేంజిలో ముద్దులు పెట్టేసుకుంటారు. వారిద్దరి మధ్య అదోకరకమైన పేరులేని అనుబంధం ప్రేక్షకులకు కూడా సరదాగానే అనిపించేలా నడుస్తోంది.

తాజాగా ఇద్దరూ కలిసి మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) స్టేజి మీద తామిద్దరం ఒకటే అనేటటువంటి అర్థం వచ్చేలా నడుచుకున్నారు. మోహన్ బాబు చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తే..చిరంజీవి ఆయనను హత్తుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే సీన్ కొంచెం భిన్నంగా వెండితెర మీద ఆవిష్కృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు తన 152 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగిగా కనిపిస్తారని చెబుతున్నారు. అంతే కాదు కొరటాల శివ ఈ సినిమాని మెసేజ్ తో కూడిన సినిమాగా తెరకెక్కిస్తున్నారని చెప్పుకుంటున్నారు. సాధారణంగా కొరటాల శివ సినిమా అంటేనే మెసేజ్ ప్లస్ మాస్ పల్స్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేవిగా ఉంటాయి.ఇపుడు మెగాస్టార్ తో కూడా అదే మేజిక్ చేయడానికి కొరటాల శివ ప్రయత్నిస్తున్నారట. ఈసినిమా అటు కొరటాల శివకూ.. ఇటు మెగాస్టార్ కూ ప్రతిష్టాత్మకమైన సినిమాగా చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ఇంకా విలన్ ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ఆ విలన్ పాత్ర కోసం కొరటాల శివ మోహన్ బాబును సంప్రదించారని తెలుస్తోంది. ఇటీవల మోహన్ బాబును కలిసిన కొరటాల శివ ఆయనకు సినిమా కథను చెప్పారని అంటున్నారు. కథ విన్న మోహన్ బాబు సినిమాలో నటించేది లేనిది త్వరలో చెబుతానని కొరటాల శివకుక్ చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాలో మోహన్ బాబు కనుక విలన్ గా నటిస్తే సినిమాకు మతింత హైప్ రావడం ఖాయం. సినిమా కూడా చరిత్ర సృష్టించడం గ్యారెంటీ అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ విలన్ పాత్రల్లోనే తమ కెరీర్ తొలినాళ్ళలో వెండితెరపై పునాదులు వేసుకున్నారు. తరువాత ఇద్దరూ హీరోలుగా తమ సత్తా నిరూపించుకున్నారు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు కూడా. ఇద్దరూ కల్సి నటించిన బిల్లా రంగా, కిరాయి రౌడీలు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సినిమాలుగా నిలిచాయి అప్పట్లో. ఇక చిరంజీవి హీరోగా చేసిన సినిమాల్లో విలన్ గా మోహన్ బాబు చాలా చిత్రాల్లో చేశారు. ఖైదీ నెంబర్ 786, చక్రవర్తి సినిమాలలో వీరి కాంబినేషన్లో వచ్చిన సీన్లకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక విలన్ గా మోహన్ బాబు చిరంజీవి తో చేసిన చివరి చిత్రం కొదమ సింహం. ఈ సినిమాలో మోహన్ బాబు నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు చిరంజీవి సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటిస్తే ప్రేక్షకులకు పండగే అనడంలో సందేహం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories