Live Updates: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ తొలిదశ ఎన్నికలు లైవ్ అప్ డేట్స్
AP Panchayat Elections 2021 Live Updates: ఏపీలో పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. తొలిదశలో 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభం అయింది. పంచాయతీ ఎన్నికల విశేషాలు ఎప్పటికప్పుడు మీకోసం లైవ్ అప్ డేట్స్ అందిస్తోంది హెచ్ఎంటీవీ.
Live Updates
- 9 Feb 2021 11:47 AM IST
AP Panchayat Elections 2021 Live UPdates: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఉద్రిక్తత
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కందులూరులో వైసీపీ అభ్యర్థి వర్గం, రెబల్ అభ్యర్థి వర్గం మధ్య ఘర్షణ నెలకొంది. ఓ వృద్ధురాలిని పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ వన్టౌన్ సీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
- 9 Feb 2021 11:25 AM IST
AP Panchayat Elections 2021 Live UPdates: కాకుమాను మండలం గరికపాడులో బూత్ ఏజెంట్ మృతి
గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాకుమాను మండలం గరికపాడులో బూత్ ఏజెంట్ మృతి చెందారు. విధులు నిర్వహిస్తుండగా గుండె నొప్పి రావడంతో ఎన్నికల కేంద్రంలో ఒక్కసారిగా కుప్పకూలారు మస్తాన్ వలి. హుటాహుటిన సిబ్బంది ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే మస్తాన్ వలీ తుదిశ్వాస విడిచారు.
- 9 Feb 2021 10:48 AM IST
AP Panchayat Elections 2021 Live UPdates: సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మి ఆందోళన
కర్నూలు జిల్లా యాగంటిపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మి ఆందోళనకు దిగారు. ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్ను విత్ డ్రా చేశారంటూ విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బాటిళ్లతో పోలింగ్ కేంద్రం దగ్గర ధర్నాకు దిగిన అభ్యర్థి విజయలక్ష్మి న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. అడ్డుకోబోయిన పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
- 9 Feb 2021 10:08 AM IST
AP Panchayat Elections 2021 Live UPdates: ప్రకాశం జిల్లాలో మొదటి విడత పంచాయతీ పోలింగ్
కాశం జిల్లాలో మొదటి విడత పంచాయతీ పోలింగ్ కొనసాగుతుంది. 14 మండలాల పరిధిలోని 227 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. 2వేల 365 పోలింగ్ కేంద్రాలలో.. మొత్తం 7వేల 754 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు.
- 9 Feb 2021 10:07 AM IST
AP Panchayat Elections 2021 Live UPdates: కడప జిల్లాలో తొలి విడత పంచాయతీ పోలింగ్
కడప జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 155 సర్పంచ్ స్థానాలు, వేయి 72 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు.
- 9 Feb 2021 10:05 AM IST
వైసీపీ, టీడీపీ వర్గీయుల బాహాబాహీ
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీ పాలెం పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఓటర్ను తమకు చూయించి ఓటు వేయాలని వైసీపీ వర్గం బెదిరించడంతో టీడీపీ వర్గం అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
- 9 Feb 2021 10:03 AM IST
శ్రీకాకుళం జిల్లా బుడుమూరు పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. లావేరు మండలం బుడుమూరు పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. పోలింగ్ కేంద్రం దగ్గరకు చేరుకొని ఇరువర్గాలకు చెదరగొట్టారు. బుడుమూరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- 9 Feb 2021 10:02 AM IST
రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ పోలింగ్ కేంద్రం దగ్గర ఘర్షణ
చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఓటర్ స్లిప్పులపై ఎన్నికల గుర్తులు రాసి పంపుతున్నారంటూ టీడీపీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ మద్దతు సర్పంచ్ అభ్యర్ధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ మద్దతుదారులు.
- 9 Feb 2021 10:02 AM IST
AP Panchayat Elections 2021 Live Updates:
మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 3,249 గ్రామ పంచాయతీలకు గాను 525 స్థానాలు ఏకగ్రీవం,
32,502 వార్డు మెంబర్లకు గాను 12,185 స్థానాల్లో ఏకగ్రీవం
రేపు 2,723 గ్రామపంచాయతీలకు, 20,157వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి..
ఎన్నికల కోసం 29,732పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు..
కోవిడ్ బాధిత ఓటర్ల కోసం సాయంత్రం చివరి గంట కేటాయింపు..
మొదటి సారి పంచాయతీ ఎన్నికల్లో నోటా తీసుకొచ్చాం
- పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది




