తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు!

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు!
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటు.. గోదావరి జిల్లాలు, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు...

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటు.. గోదావరి జిల్లాలు, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కుదులుతుండటంతో.. వానలు పడుతున్నాయి. మరోవైపు ఈ నెల 31 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడుతాయని.. అధికారులు వెల్లడించారు.

ఏపీలో గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే సీలేరు నదికి వరద నీరు వచ్చి చేరడంతో.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో.. రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి.

ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. ఒకటి రెండు రోజుల్లో కాటన్‌ బ్యారేజి వద్ద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. నిన్న రాత్రి వరకు బ్యారేజి వద్ద గోదావరి నీటిమట్టం 10.7 అడుగులుగా నమోదుకావడంతో.. బ్యారేజి నుంచి 69 వేల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేశారు.

ఇటు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత మూడు రోజులుగా పడుతున్న వర్షాలతో.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఊళ్లలోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. నిన్న ములుగు, ఆదిలాబాద్‌, వరంగల్‌, జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 3 రోజుల పాటు.. మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు కురవడం, ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో.. దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. నిన్నటి వరకు ఆల్మట్టి ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఇవాళ ఆల్మట్టి గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories