మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే ఆ ఆరుగురు ఎవరు?

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే ఆ ఆరుగురు ఎవరు?
x
Highlights

గులాబీ పార్టీలో మంత్రివర్గ ఆశావాహులు లిస్టు పెరిగిపోతోంది. అతి త్వరలో కేబినెట్ విస్తరణ ఉండటంతో, ఎవరికి పదవులు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో...

గులాబీ పార్టీలో మంత్రివర్గ ఆశావాహులు లిస్టు పెరిగిపోతోంది. అతి త్వరలో కేబినెట్ విస్తరణ ఉండటంతో, ఎవరికి పదవులు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నేతలు. మరి మంత్రివర్గంలోకి కొత్తగా వచ్చే ఆ ఆరుగురు ఎవరు ఎవరికి ఉద్వాసన తప్పదు ఎవరికి స్థానచలనం కేబినెట్‌లో బెర్త్‌ దొరికే ఆ ఇద్దరు మహిళామణులు ఎవరు?

తెలంగాణలో పూర్తిస్థాయి మంత్రి వర్గ ఏర్పాటుపై చర్చ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎం కేసీఆర్ తనతో పాటు కేవలం హోం మంత్రిగా మహమూద్ అలీకి మాత్రమే చోటిచ్చారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గం విస్తరణలో మరో పది మంది మంత్రులకు తన క్యాబినెట్లో చోటు కల్పించారు. అయితే మంత్రివర్గంలోనికి మరో ఆరుగురికి అవకాశం కల్పించే వీలుంది. ఇప్పుటికే అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందోనన్న చర్చ సాగుతోంది.

ఈనెల 7వ తేదీతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియనుండగా, ఆ తర్వాత ఏ క్షణంలోనైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని, అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో గంటకు పైగా సమావేశమయ్యి మంత్రి వర్గ విస్తరణతోపాటు ఇతర కీలక అంశాలు చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో తీసుకోబోతున్న ఆరుగురి గురించి, గవర్నర్‌తో డిస్కస్ చేసినట్టు సమాచారం.

ఉమ్మడి జిల్లాలా వారీగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాల్లో కేవలం ఒక్క ఖమ్మం స్థానంలో, అజయ్ మాత్రమే గెలుపొందారు. అక్కడ స్థానిక నేతల అంతర్గత పోరువల్లే మొత్తం స్థానాలు ఓడామనే ఆగ్రహంలో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. అందుకే అక్కడ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కి తొలి దశ మంత్రి వర్గ విస్తరణలో స్థానం లభిస్తుందని అంతా భావించినా, గులాబీబాస్ కనికరించలేదు. అయితే ఆ తర్వాతా పార్టీలోకి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నుంచి బట్టీ తప్పా, అంతా గులాబీ గూటికి చేరారు. దాంతో మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో అంతా కలిసి కట్టుగా పనిచేసి ఖమ్మం స్థానం గెలిపించారు కాబట్టి ఈసారి ఇక్కడి నుంచి ఎవరికి మంత్రి వర్గంలో స్థానం లబిస్తోందనే చర్చ ఉంది.

మరోవైపు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కీలక స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవ‌టంతో, అక్కడ బాధ్యతలు చూసిన కొంద‌రు మంత్రుల‌కు ఉద్వాస‌న త‌ప్పద‌న్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇందులో ప్రధానంగా ఆదిలాబాద్‌, మ‌ల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, నిజామాబాద్, క‌రీంన‌గ‌ర్, న‌ల్లగొండ‌, భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్‌కు గట్టి ప‌రాభ‌వం ఎదురైంది. ఈ ప్రభావం కచ్చితంగా అక్కడి మంత్రుల‌పై ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మంత్రులు మ‌ల్లారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, జ‌గ‌దీశ్ రెడ్డిలలో ఒక‌రిద్దరిని క్యాబినెట్ నుంచి త‌ప్పించ‌వ‌చ్చనే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రికొంద‌రికి శాఖ‌ల మార్పులుండొచ్చని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. ఈ విషయంపై కూడా సీఎం కేసీఆర్ గవర్నర్ సమావేశం సందర్భంగా చర్చించినట్టు పార్టీ నేతలంటున్నారు.

అసెంబ్లీలో సీఎం హీమి ఇచ్చిన మేరకు ఇద్దరు మహిళా మంత్రుకు స్థానం కల్పించాల్సి ఉంటుంది. అందులో సీనియర్ మహిళా నేతలు చాలా మంది పోటీలో ఉన్నారు. ఇందులో సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇటేవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి భవిష్యత్తు, కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్‌లో విలీనంపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. పద్మాదేవేందర్ రెడ్డి, గొంగడి సునీత కూడా తమకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కోరుతున్నారు. అయితే మంత్రిమండిలో కవితకు అవకాశం ఇస్తారన్న చర్చ కూడా నడుస్తోంది.

ఉన్న ఆరు స్థానాల్లో ఇద్దరు మహిళలు పోతే మరో నాలుగు మాత్రమే ఉంటాయి. ఇందులో ఖమ్మం నుంచి ఒకరికి అవకాశం ఉంటుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ను కరీనంగర్ నుంచి, పార్టీ సీనియర్ నేత హరీష్ రావును మెదక్ నుంచి మంత్రివర్గంలో స్థానం కల్పించే ఛాన్సుంది. రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన పట్నం మహేందర్ రెడ్డికి అవకాశాలు మెండుగా ఉన్నట్టు పార్టీ నేతలంటున్నారు. వరంగల్ నుంచి కడియం, మహబూబ్ నగర్ లక్ష్మారెడ్డిలు, ఆదిలాబాద్‌ జోగు రామన్నలు తమకు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి మరో మంత్రికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇందులో దానం నాగేందర్, కూన వివేకానంద గౌడ్, అరికేపూడి గాంధీల్లో ఎవరికి బెర్త్ దొరుకుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే అన్ని సామాజిక వర్గాల సమతూకం పాటించి సీఎం కేసీఆర్ తమ మంత్రివర్గంలోనికి తీసుకుంటారని అంటున్నారు.

మొత్తానికి ఆశావాహులు ఎంత మంది ఉన్నారు సీఎం తన టీంలో ఎవరికి అవకాశం కల్పిస్తారో చూడాలి. ఈ వారం తర్వాత కచ్చితంగా విస్తరణ ఉంటుందని, లేకుంటే పార్లమెంటు సమావేశాల తర్వాత అసెంబ్లీకి ముందు విస్తరణ చేస్తారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories