పాకిస్థాన్‌కు అమెరికా భారీ సాయం.. పాక్‌కు ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్ల విక్రయానికి గ్రీన్‌ సిగ్నల్‌

US approves $450 million F-16 fleet sustainment programme to Pakistan
x

పాకిస్థాన్‌కు అమెరికా భారీ సాయం.. పాక్‌కు ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్ల విక్రయానికి గ్రీన్‌ సిగ్నల్‌

Highlights

*అమెరికా సాయాన్ని పునరుద్ధరించిన బైడెన్‌ ప్రభుత్వం

US-Pakistan: భారత్‌పై నిత్యం విషం చిమ్మే పాకిస్థాన్‌కు అత్యాధునిక యుద్ధ విమానాలను అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. పైకి ఉగ్రవాద నిర్మూలన పేరుతో ఈ డీల్‌కు జో బైడెన‌‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా 45 కోట్ల డాలర్ల విలువైన ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లను అందించనున్నది. 2018 తరువాత తొలిసారి ఈ తరహా సహాయానికి అమెరికా ఆమోదం తెలిపింది. భద్రతాపరమైన సమతౌల్యం పేరు అమెరికా చెబుతున్నా.. పాకిస్థాన్‌ మాత్రం వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాదులు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్న రీతిలో ఉండే దాయాది దేశం భారత్‌ఫై వాటిని ఎక్కుపెట్టే అవకాశమే ఉంది.

చింత చచ్చినా పులుపు చావదన్న సామెత దాయది దేశం పాకిస్థాన్‌కు అచ్చంగా సరిపోతుందేమో.. ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి పాలకులు.. ప్రజా సంక్షేమానికి కాకుండా.. ఆయుధాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్ల కొనుగోలుకు పాకిస్థాన్‌ ఎప్పటి నుంచో మొగ్గుచూపుతోంది. వాటిని కొనుగోలు చేయాలని ఆరాటపడుతోంది. అయితే 2018లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. పాకిస్థాన్‌కు సాయంతో పాటు ఆయుధాల విక్రయానికి కూడా పుల్‌స్టాప్‌ పెట్టేశారు. అప్పట్లో 200 కోట్ల డాలర్ల సాయం పాకిస్థాన్‌కు ఆగిపోయింది. అప్ఘానిస్థాన్‌లో తాలిబన్లు, హక్కానీ నెట్‌వర్క్‌ వంటి ఉగ్ర గ్రూపులను నిలువరించడంలో పాకిస్థాన్‌ విఫలమయ్యిందటూ ట్రంప్‌ ఆరోపించారు. ఉగ్రవాద పోరాటంలో పాకిస్థాన్‌ తమ భాగస్వామి కాదని స్పష్టం చేశారు. నాలుగేళ్ల తరువాత.. బైడెన్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌కు ఆయుధాలను విక్రయించేందుకు సిద్ధమైంది. తాజాగా 45 కోట్ల డాలర్ల విలువైన భారీ సాయం అందించేందుకు ఓకే చెప్పింది. ఉగ్రవాద నిరోదక చర్యల్లో భాగంగా ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లను విక్రయించనున్నట్టు తెలిపింది. విదేశీ సైనిక సాయం కింద ఈ యుద్ధ విమానాలను అందిస్తున్నట్టు యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో భద్రతా పరమైన సమతౌల్యానికి ఎలాంటి హానీ ఏర్పడదని అమెరికా స్పష్టం చేసింది. ఆ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు వివరాలను వెల్లడించింది.

అయితే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పొరుగుదేశాలపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదు. కేవలం ఉగ్రవాదంపై పోరాడేందుకు, విద్రోహ శక్తులను అంతం చేసేందుకు మాత్రమే.. ఈ యుద్ధ విమానాలను రంగంలోకి దించాలి. ఈ నిబంధన మేరకు కొనుగోలు సమయంలో ఒప్పందంపై సంతకం చేసింది. అయితే పాకిస్థాన్‌ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. 2019 మార్చిలో ఈ ఎఫ్‌-16 యుద్ధ విమానాలతోనే దాడికి దిగింది. ఈ దాడులను వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్దమాన్‌.. మిగ్‌ బైసన్‌ యుద్ధ విమానంతో నిలువరించారు. దీనికి సంబంధించి ఆధారాలను కూడా భారత్‌ చూపించింది. పాకిస్థాన్‌కు చెందిన అమ్రామ్‌ క్షిపణులను తీసుకెళ్లే సామర్థ్యం ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు మాత్రమే ఉంది. ఈ విషయమై భారత్‌ అప్పట్లో ఎండగట్టింది. నిజానికి ఉగ్రవాదంపై పోరాడేందుకు మాత్రమే వినియోగించాల్సిన ఈ యుద్ధ విమానాలను భారత్‌పై గురి పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాము ఎఫ్‌-16 యుద్ధ విమానాలు వాడలేదని పాకిస్థాన్ బుకాయించింది. భారత్‌ అందించిన సాక్ష్యాలు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అప్పట్లో అమెరికా కూడా ప్రకటించింది. నిజానికి 2016లోనే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను భారత్‌పై పాకిస్థాన్‌ ప్రయోగించే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తమైంది. అప్పట్లో 8 ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లను అమెరికా చట్ట సభ్యులు అడ్డుకున్నారు.

పాకిస్థాన్‌ చైనాకు అత్యంత సన్నిహిత దేశం ఆ దేశానికి ఆయుధాలను విక్రయించడమంటే చైనాకు ఆ సాంకేతికతను అందజేయడమేనని నిపుణులు వాదిస్తున్నారు. అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలనే చైనా కాపీకొడుతోందటున్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయాన్ని విస్మరించి పాకిస్థాన్‌కు తాజాగా అమెరికా సాయం ప్రకటించింది. అయితే అల్‌ఖైదా కీలక ఉగ్రవాది అల్‌ జవహరీని హతమార్చేందుకు పాకిస్థాన్‌ సాయమందించిందని గతంలో తాలిబన్లు ఆరోపించారు. అల్ జవహరీ హత్యకు సహకరించినందుకే ఇప్పుడు అమెరికా అప్డేట్‌ చేసిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలను అందించినట్టు తెలుస్తోంది. అత్యాధునిక యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు ఇవ్వడంపై భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. పాకిస్థాన్‌కు ఆయుధాలు ఇవ్వడమంటే.. భారత్‌పై యుద్ధానికి ఉసిగొల్పడమేనని పలుమార్లు భారత్‌ ఆరోపించింది. అయినా.. అమెరికా తాజాగా యుద్ధ విమానాలు ఇవ్వడంతో.. అగ్రదేశం ద్వంద్వ వైఖరి.. స్వలాభాలకే ప్రాధాన్యమిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇక ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లను అమెరికా 2021లో అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ ఫైటర్‌ జెట్‌ పొడవు 15 మీటర్లు, బరువు 9వేల 207 కేజీలు ఉంటుంది. ఇది 4వేల 220 కిలోమీటర్ల రేంజ్‌లో ఫైట్‌ చేయగలదు.

ప్రస్తుతం పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారక నిధులు నిండుకున్నాయి. దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పాకిస్తాన్‌ ప్రజలు తల్లడిల్లుతున్నారు. పేదరిక నిర్మూలనకు కూడా ఆ దేశం పన్ను విధించింది. ఆస్తులను తనఖా పెడుతోంది. మరోవైపు వరదలు ఆ దేశాన్ని నిండా ముంచేస్తాయి. సగానికి పైగా పాక్‌లోని భూభాగం నీట మునిగింది. అసలు ప్రజలకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేని దైన్య పరిస్థితి.. అలాంటి పాకిస్థాన్‌.. ఇప్పుడు 45 కోట్ల డాలర్లు వెచ్చించి.. ఆయుధాలను కొనుగోలు చేయడం అవసరమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే పాకిస్థాన్‌ మాత్రం నిత్యం భారత్‌పై అస్త్రాలను గురిపెట్టేందుకే యత్నిస్తోంది. అందుకే నిధులను భారీగా తగలేస్తోంది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ -ఐఎంఎఫ్‌ నుంచి భారీ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తోంది. అయితే.. అందుకు ఐఎంఎఫ్‌ నిర్దేశించిన షరతులను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆయుధాల కొనుగోలుపై ఐఎంఎఫ్‌ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.

తాజా నిర్ణయంతో అమెరికా తన వక్రబుద్ధిని మరోసారి బయట పెట్టింది. భారత్‌ తమకు వ్యూహాత్మక మిత్రదేశమని పదే పదే అమెరికా చెబుతోంది. పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలను ఇచ్చి... తన కుటిలత్వాన్ని చాటుకుంది. అందుకే అగ్రదేశాన్ని పలు దేశాలు అనుమానంగా చూస్తున్నాయి. చైనాతో మిత్రదేశంగా వ్యవహరిస్తున్న రష్యా కంటే.. అమెరికానే ప్రమాదకరమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాను నమ్మితే నిండా ముంచుతుందని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories