మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు

* సూకీ, కీలక నేతల గృహనిర్బంధం.. ఏడాది పాటు ఎమర్జెన్సీ * ఆ తర్వాతే ఎన్నికలు.. గెలిచిన వారికే అధికారం: ఆర్మీ ప్రకటన * నెట్‌, ఫోన్లు బంద్‌.. ప్రజాస్వామ్య సంస్కరణలకు విఘాతం

Sandeep Eggoju
Updated on: 2 Feb 2021 8:30 AM IST
The military uprising in Myanmar
X

Representational Image

మయన్మార్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలను సైన్యం సోమవారం గృహనిర్బంధం చేసింది. పాలన పగ్గాలను తమ చేతిలోకి తీసుకుంటున్నట్లు సైన్యం తమ సొంత మీడియా ద్వారా ప్రకటించింది. దేశంలో ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని విధించింది. ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలను నిలిపివేసింది. మయన్మార్‌ పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, ఒక ఏడాది పాటు దేశం తమ అదుపులోనే ఉంటుందని, ఏడాది తర్వాత ఎన్నికలు నిర్వహించి విజేతకు అధికారాన్ని అప్పగిస్తామని సైన్యం వెల్లడించింది. అప్పటి వరకూ కమాండర్‌-ఇన్‌-చీ్‌ఫ మిన్‌ ఆంగ్‌ హ్లింగ్‌ దేశానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని, ఉపాధ్యక్షుడు మైంట్‌ స్వే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారని స్పష్టం చేసింది.

గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న తమ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కరోనా విజృంభించిన సమయంలో ఎన్నికలు వాయిదా వేయడంలోనూ ప్రభు త్వం విఫలమైందని సైన్యం ఆరోపించింది. దేశంలో సైనిక తిరుగుబాటు తప్పదని సైనికాధికారులు కొద్దిరోజుల క్రిత మే హెచ్చరించారు. ఎన్నికల అనంతరం తొలి పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు చట్టసభ్యులు నేపిడాలో సోమవారం సమావేశం కావాల్సి ఉండగా తెల్లవారు జామునే నాయకులను సైన్యం నిర్బంధంలోకి తీసుకుంది. ఎన్‌ఎల్‌డీ కీలక నేతల్లో ఒక్కరూ ఫోన్‌కాల్స్‌కు స్పందించ డం లేదని అక్కడి మీడియా తెలిపింది. సూకీతో పాటు దేశాధ్యక్షుడిని కూడా గృహనిర్బంధం చేశారని వెల్లడించిం ది. కాగా, మిలిటరీ తిరుగుబాటును ఎన్‌ఎల్‌డీ ఖండించింది. ఈ తిరుగుబాటును, సైనిక నియంతృత్వాన్ని వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు, అగ్ర నేతల గృహనిర్బంధంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అండగా ఉంటామని విదేశాంగ శాఖ ప్రకటించింది. మయన్మార్‌లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా పేర్కొంది. నిర్బంధంలో ఉంచిన సూకీ, ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరింది. సైనిక తిరుగుబాటు ప్రజాస్వామ్య సంస్కరణలకు తీవ్ర విఘాతం అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story