Guatemala: ఘోర రోడ్డు ప్రమాదం, 55 మంది మృతి

గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు. బస్సు వంతెనపై నుంచి జారిపడి లోయలోని మురుగు నీటిలో పడిపోయింది.

Vijaya Laxmi
Published on: 11 Feb 2025 11:16 AM IST
Guatemala Bus Accident 55 Members Dead
X

ఘోర రోడ్డు ప్రమాదం, 55 మంది మృతి

Guatemala: గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు. బస్సు వంతెనపై నుంచి జారిపడి లోయలోని మురుగు నీటిలో పడిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 53 మృతదేహాలను వెలికితీశామని.. మరో ఇద్దరు శాన్ జువాన్, డి డియోస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 75 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

బస్సు రాజధానికి ఈశాన్యంగా ఉన్న ప్రోగ్రెసో నుంచి వచ్చిందని, బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని అగ్ని మాపక అధికారి ఆస్కార్ సాంచెజ్ తెలిపారు. బస్సు ప్రోగ్రెసో అనే ప్రాంతం నుంచి బయలుదేరి గ్వాటెమాలా నగరానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదానికి గురైనట్టు సమాచారం. ప్రోగ్రెసో రాజధాని గ్వాటెమాలా నగరానికి ఈశాన్యంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. ఈ బస్సులో చాలా మంది ప్రయాణికులు స్థానిక ప్రజలుగా చెబుతున్నారు. బస్సు కలుషిత నీటిలో తలక్రిందులుగా దిగడంతో సహాయక చర్యలను చేపట్టడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.

గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవాలో ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడంతో పాటు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Vijaya Laxmi

Vijaya Laxmi

Next Story