5 కోట్ల ఇళ్లను కూల్చేయనున్న చైనా.. త్వరలో కూల్చేసేందుకు బీజింగ్‌ ప్లాన్‌

China will Demolish 5 Crore Houses | Telugu News
x

5 కోట్ల ఇళ్లను కూల్చేయనున్న చైనా.. త్వరలో కూల్చేసేందుకు బీజింగ్‌ ప్లాన్‌

Highlights

*భవనాల నిర్మాణం పూర్తి చేయాలంటే...44.40 వేల కోట్ల డాలర్లు అవసరం

China: నోయిడాలో ట్విన్ టవర్స్‌ కూల్చివేత భారత్‌లో సంచలనం సృష్టించింది. అక్రమంగా నిర్మించారని 29, 32 అంతస్తుల రెండు భారీ టవర్లను ఆగస్టు 28న 14 సెంకడ్లలో కూల్చివేశారు. ఈ రెండు టవర్ల కూల్చివేతతోనే వెయ్యి కోట్ల రూపాయలు సూపర్‌ టెక్‌ కంపెనీకి నష్టం వాటిల్లింది. అంతపెద్ద టవర్లను కూల్చివేస్తుంటే.. అయ్యో.. కూల్చివేత ఎందుకు.. దేనికైనా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా.. అని ఎందరో ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. రెండు టవర్లకే మనం ఇలా అనుకుంటే.. చైనాలో కూల్చేసిన... కూల్చేయబోతున్న టవర్ల లెక్క తెలిస్తే మాత్రం గుండె బద్దలు అవుతుందేమో.. డ్రాగన్‌ కంట్రీ ఏకంగా 5కోట్ల ఇళ్లను కూల్చేసేందుకు సిద్ధమవుతోంది. ఇవన్నీ అక్రమంగా కట్టినవి అనుకుంటే పొరపాటే..

ఢిల్లీ శివారులోని నోయిడాలో అక్రమంగా నిర్మించారన్న కారణంతో భారీ టవర్లను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేవలం 14 సెకండ్లలో కూల్చివేశారు.ఈ కూల్చివేతలకు వాటర్‌ ఫాల్‌ టెక్నిక్‌ని వినియోగించారు. తొమ్మిదేళ్ల పాటు శ్రమించి.. వెయ్యి కోట్ల రూపాయల విలువైన 29, 32 అంతస్థుల టవర్లను క్షణాల్లో కూల్చేశారు. ఈ భవనాల కూల్చివేత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంత విలువైన జంట టవర్లకూల్చివేయడంతో సొంతిళ్లు లేనివారిని కలచివేసింది. ఆ భవనాలను కూల్చేవేసే బదులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. వేరేరకంగా ఉపయోగించుకోవచ్చు కదా.. అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. జంట టవర్ల కూల్చివేతపై జోరుగా చర్చ జరిగింది. టవర్ల కూల్చివేత, శిథిలాల తొలగింపుపై కథలు కథలుగా చెప్పుకున్నారు. రెండు టవర్ల కూల్చివేతకే ఇంత జరిగితే.. అదే చైనాలో కూల్చివేతల గురించి తెలిస్తే.. గుండెలు బద్దలవుతాయేమో... గతేడాది నుంచి చైనాలో భారీ టవర్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 2021 సెప్టెంబరు 15న ఏకంగా 15 అతి పెద్ద టవర్లను బీజింగ్‌ కూల్చేసింది. చైనాలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థ ఎవర్‌గ్రాండ్‌కు చెందిన 39 భారీ టవర్లను అక్కడి అధికారులు కూల్చేశారు. భారీగా టవర్లను కూల్చేవేయాలని గత నెల 23న చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. త్వరలో ఎన్ని టవర్లను చైనా కూల్చేయబోతోంది? అసలు టవర్లను కూల్చేవేత వెనుక కథేమిటి?

కరోనా తరువాత.. చైనా ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతిన్నది 2020లో కరోనా ఉధృతమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు జీరో కోవిడ్‌ పేరుతో వరుస లాక్‌డౌన్లను విధిస్తోంది జిన్‌పింగ్‌ ప్రభుత్వం. పరిశ్రమలు మూతపడి.. ఉత్పత్తి భారీగా పడిపోయింది. ప్రజలకు ఉపాధి లేకపోవడంతో ఆదాయం పడిపోయింది. అదే సమయంలో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల రుణాలకు వాయిదాలను చెల్లించలేకపోయారు. దీంతో నిర్మాణ సంస్థలు తీవ్ర నష్టాల పాలయ్యాయి. ఫలితంగా.. భారీ టవర్ల నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. బ్యాంకులు దివాళా తీశాయి. దీంతో ప్రాపర్టీ సెక్టర్‌ కుప్పకూలింది. 300 కోట్ల చదరపు మీటర్ల ఇళ్లను కూల్చేయాలని డ్రాగన్‌ కంట్రీ నిర్ణయించింది. వీటిలో అధిక భాగం మధ్యలో అగిపోయినవి.. లేదా.. నిర్మాణం పూర్తయినవి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. చైనాలో మొత్తం 5 కోట్లకు పైగా ఇళ్లు కొత్తగా నిర్మించినట్టు గణాంకాలు వివరిస్తున్నాయి. వాటిలో ఎవరూ నివసించడం లేదట. అయితే ఈ లెక్కలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా కావాలని లెక్కలు తక్కువ చేసి చూపుతుందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. దాదాపుగా 10 కోట్లకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. వాటిలో 3 కోట్లకు పైగా విక్రయించనివి ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అసలు చైనాలో అన్ని కోట్ల ఇళ్లను ఎందుకు నిర్మించారు? అవన్నీ ఎందుకు ఖాళీగా ఉన్నాయి?

నిజానికి చైనాలో సొంతిల్లు అనేది ఓ గౌరవంగా భావిస్తారు. అక్కడ పెళ్లికి ముందే యువకులు ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ నమ్మకాన్నే చైనాలోని నిర్మాణ కంపెనీలు క్యాష్‌ చేసుకోవడానికి భారీగా ఇళ్లను నిర్మించారు. కరోనా అక్కడి నిర్మాణ కంపెనీల కొంపముంచాయి. 2020 నుంచి ఏటా 35 శాతం హౌసింగ్‌ సేల్స్‌ పడిపోతున్నాయి. ఫలితంగా ఇప్పుడు చైనాలో ఏకంగా 10 కోట్ల మేర ఇళ్లు ఖాళీగా ఉన్నాయట. వాటిని నిర్మించిన డెలవలర్స్‌ అప్పుల్లో కూరుకుపోయారు. 18 నిర్మాణ సంస్థలు బోర్డులను తిప్పేశాయి. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ ఎవర్‌గ్రాండ్‌ కూడా ఉంది. జులై చివరి నాటికి 93 నగరాల్లో 319కి పైగా ప్రాజెక్టులపై ప్రభావం పడింది. ఇప్పుడు నిర్మించిన వాటిలో 2013 నుంచి 2020 నాటికి 60 శాతం మేర ముందస్తుగా విక్రయించారు. ఇప్పుడు ఆ ఇళ్ల కొనుగోలుదారులు రుణాల వాయిదాలను చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనప్పుడు డబ్బును ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇలా బ్యాంకులకు చెల్లించని రుణాలు మొత్తం 2వేల 700 కోట్ల డాలర్ల నుంచి 3వేల కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గత్యంతరం లేక పలువురు ఇప్పటికే ప్రాజెక్టులను వదిలేసుకున్నారు. వాటినే ఇప్పుడు చైనా ప్రభుత్వం కూల్చేయాలని నిర్ణయించింది. నిర్మాణం పూర్తిచేయకపోతే చైనా కూల్చివేయాలని ఎందుకు భావిస్తోంది? దాని వెనుక ఉన్న స్టోరీ ఏమిటి?

సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాపర్టీ మార్కెట్‌ను స్థిరీకరించాలని భావిస్తోంది. అందుకు ఆగిపోయిన ప్రాజెక్టులను కూల్చివేయాలని డిసైడ్‌ అయ్యింది. అలా ఆగిపోయిన ఇళ్లు మొత్తం 5 కోట్ల మేర ఉన్నట్టు చైనా ప్రభుత్వం గుర్తించింది. 7 కోట్ల కుటుంబాలు సరిపడా ఇళ్లు ఉన్నాయి. అంటే.. దాదాపు బ్రిటన్‌ ప్రజలందరికీ సరపడా ఇళ్లు చైనాలో ఖాళీగా ఉన్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థకు నాలుగు పిల్లర్లు ఉంటే.. ప్రాపర్టీ మార్కెట్‌ అందులో ఓ పిల్లర్‌.. అలాంటి ప్రాపర్టీ రంగం దారుణంగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే.. 44వేల 400 కోట్ల డాలర్లు అవసరం. అయితే.. ఇప్పుడు చైనా బ్యాంకులు అంత రుణాలను ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. ప్రస్తుతం కేవలం 14వేల 800 కోట్ల డాలర్లకు మాత్రమే బీజింగ్‌ రుణాలను సర్దుబాటు చేసేందుకు అంగీకరించింది. మరి మిగతా వారి పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాటన్నింటిని కూల్చేయాలని చైనీయులు కోరుకుంటున్నారు. అందుకే బీజింగ్‌ వాటన్నింటిని కూల్చేయాలని ఆగస్టు 23నే నిర్ణయం తీసుకుంది.

జంట టవర్ల కూల్చివేతకే అయ్యో అనుకున్నవారు.. చైనా కూల్చివేతల గురించి తెలిస్తే మాత్రం షాక్‌ అవుతారు. గుండెలు బాదుకుంటారు. ఏకంగా 7 కోట్ల కుటుంబాలు నివశించే వీలున్న ఇళ్లను కూల్చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారేమో.. ఏం చేసినా.. చైనా.. వేరే లెవల్‌లో చేస్తుంది. డ్రాగన్ కంట్రీ చర్యలకు... ప్రపంచ మంతా ఔరా.. అని ముక్కున వేలేసుకునాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories