భిన్నమైన తీర్పిచ్చే మానుకోట ఈసారి ఏమనుకుంటోంది?

Santosh
Published on: 25 March 2019 3:41 PM IST
భిన్నమైన తీర్పిచ్చే మానుకోట ఈసారి ఏమనుకుంటోంది?
X

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నేల. తెలంగాణ పౌరుషానికి ప్రతికగా ఉన్న గడ్డ. 2019 ఎన్నికల సమరానికి మరోసారి సై అంటోంది. ఈసారి రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీకి సై అంటున్నాయి. మానుకోట గడ్డపై జెండా ఎగరేయాలని అధికార, ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. దాని కోసం కత్తులు నూరుతున్నాయి. ఇన్ని సమీకరణాల మధ్య సమరంలో గెలిచి నిలిచేదెవరు?

తెలంగాణ ఉద్యమంలో రాళ్ళ వర్షం కురింపించిన నేల మానుకోట. ఆనాడు ఉద్యమానికి ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఘటన నేటికి కేసులలో నేతలు ఇప్పటికి కోర్టు హాజరవుతున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్ చరిత్ర అలాంటిదే. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హన్మకొండ పార్లమెంట్... ఎస్టీ రిజర్వ్‌ అవుతూ మహబూబాబాద్‌గా అవతరించంది. 2009లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాంనాయక్, సీపీఐ నుంచి కుంజా శ్రీనివాస్‌రావుపై 68వేల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్‌ నుంచి బరిలోకి దిగిన సీతారామ్‌నాయక్‌... కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌పై 35 వేల మెజారిటీతో గెలిచారు. కానీ మారుతున్న కాలంతో పాటు అక్కడ సమీకరణలూ మారాయి. ఈసారి అన్ని పార్టీలకు విజయం అంత సులువైందేమీ కాదంటున్నారు విశ్లేషకులు.

మహబుబాబాద్‌లో ఇప్పటి వరకు రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి కాంగ్రెస్, ఇంకోసారి టీఆర్ఎస్‌ గెలిచాయి. ఈసారి మరోమారు ఈ రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఇక్కడ ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువ కావడంతో ఈ స్థానాన్ని ఎస్టీకి రిజర్వుడు చేశారు. 2014 ఎన్నికల్లో మొత్తం 11 లక్షల 2 వేల ఓట్లు పోలవగా, టీఆర్ఎస్‌కు 3 లక్షల 20 వేలు, కాంగ్రెస్‌కు 2 లక్షల 85 వేలు, తెలుగుదేశం పార్టీకి 2 లక్షల 20 వేలు ఓట్లు వచ్చాయి.

మహబుబాబాద్‌ పార్లమెంట్ పరిధిలో మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజల కష్టాలు గత పదేళ్లలో ఏమీ తీరలేదన్న అపవాదు ఉంది. నిత్యం సమస్యల వలయంలో జీవనం సాగిస్తున్నారు ఇక్కడి గిరిజనులు, ఆదివాసీ ప్రజలు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం యువత ఎదరుచూపులు ఆగలేదు. డోర్నకల్, మహబూబాబాద్ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులు కావాలని బలమైన డిమాండ్ చేస్తున్నా తమ మాటను పట్టించుకున్న వారే లేరంటున్నారు ప్రజలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రమైనా నిధులు, అవసరాలు శూన్యమని విమర్శిస్తున్నారు.

తక్షణమే ప్రత్యేక బడ్జెట్‌తో అభివృద్ధి చేయాలన్నది వారి మనోగతం. ఇక గిరిజనులకు, ఆదివాసీలు విద్య, వైద్యం నేటికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఒక్క జాతీయ విద్యాలయం కూడా లేకపోవడంతో పాటు గిరిజన యూనివర్సిటీ కాగితాలకే పరిమితమైందన్న ఆరోపణలున్నాయి. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సరక్క మేడారం జాతర ఉన్నా ఉపాధి కరువు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పర్యటక ప్రాంతం ఉన్నా ఆదివాసీలకు ఉపాధి దొరక్కట్లేదన్న పేరుంది. పేపర్ బిల్ట్ ఫ్యాక్టరీ మూతపడి ఏళ్ళు గడుస్తున్నా పట్టించుకున్న పాపన పోలేదంటున్నారు ప్రజలు. మూడువేల మంది కార్మికులు రోడ్డున పడ్డా కూడా తమను గాలికొదిలేశారని బాధితులు దుయ్యబడుతున్నారు. పార్టీల కసరత్తులు ఎలా ఉన్నా పట్టం కట్టాల్సిన ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారా అంతు చిక్కడం లేదు. గత రెండు ఎన్నికల్లో మార్పు చూపించిన ప్రజలు ఈ ఎన్నికల్లో ఎటు మొగ్గుచూపుతారో చూడాలి.

Santosh

Santosh

Next Story