దూకుడుపెంచుతున్న కమలం... వికసిస్తుందా... వాడిపోతుందా?

దూకుడుపెంచుతున్న కమలం... వికసిస్తుందా... వాడిపోతుందా?
x
Highlights

సార్వత్రిక ఎన్నికలకు ముందు కమలం పార్టీ దూకుడు పెంచింది. పొత్తులు, ఎత్తులతో పట్టు సాధించే వ్యూహానికి కసరత్తు ప్రారంభించింది. ఈసారి ఎలాగైనా పట్టు...

సార్వత్రిక ఎన్నికలకు ముందు కమలం పార్టీ దూకుడు పెంచింది. పొత్తులు, ఎత్తులతో పట్టు సాధించే వ్యూహానికి కసరత్తు ప్రారంభించింది. ఈసారి ఎలాగైనా పట్టు సడలకుండా, జట్టు కట్టి అవతలి పార్టీని అల్లాడించాలన్న ఎత్తుగడకు సానపెడుతోంది. ఇందులో భాగంగానే పాత శతృత్వాలను పక్కనపెట్టేసి.. స్నేహగీతం ఆలపిస్తోంది. ఐక్యతారాగాన్ని వినిపిస్తుంది. మహారాష్ట్రలో శివసేనతో జట్టు కట్టి... తమిళనాట అన్నాడీఎంకే, పీఎంకేతో బంధాన్ని బలోపేతం చేసుకుంది. ఉత్తరాదిన ఊపు కాస్త అటు... ఇటు అయినా... దక్షిణాదిన పట్టు దక్కించుకోవాలన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. మరి బీజేపీ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా? సౌత్‌ పాలిటిక్స్‌లో మారే సమీకరణలను కాషాయం ఎలా క్యాష్‌ చేసుకోగలదు? సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించాలన్నది కమలం వ్యూహం. అందుకే మోడీ టీమ్‌ ఆ వ్యూహానికి పదును పెడుతోంది. ఎక్కడ కొట్టాలో కాదు... ఎక్కడ పట్టాలో నాడి తెలిసిన మోడీ క్యాంప్‌... అసలు సిసలు రాజకీయానికి తెరలేపింది. చక్రం తిప్పే ప్రధాన పార్టీలను తన వలలో వేసుకునేందుకు, అవసరమైతే చిన్నా చితక పార్టీలకు రామ్‌రామ్‌ చెప్పేందకు రెడీ అవుతోంది.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు మోడీ టీం కసరత్తును షురూ చేసింది. ప్రధాన పార్టీల పొత్తుల కోసం ఎన్డీఏ కూటమిలో ఉన్న చిన్న పార్టీలను వదులుకునేందుకు కాషాయం పార్టీ సిద్ధంగా ఉందన్న సంకేతాలను ఇస్తోంది. గత ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటే చేసే బలం బీజేపీకీ ఉన్న ఎన్డీఏ పక్షాలను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించింది. గత ఎన్నికలకంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని భావించినా బీజేపీ ఎన్డీఏలోని అన్ని పార్టీలతో పొత్తు కుదుర్చుకునేందుకు ఫ్లాన్‌ వేసింది. అయితే ఈసారి పొత్తుల విషయంలో మోడీ, షా సరికొత్తగా ఎత్తుగడలు వేస్తున్నారు. రాష్ట్రాల్లో ప్రజాదరణ ఉండి, అధికారంలో ఉన్న పార్టీలతో పొత్తుకు అడుగులు వేస్తున్నారు. బీహార్‌‌లో అధికారంలో ఉన్న జేడీయూతో లోక్‌‌సభ ఎన్నికల పొత్తును బీజేపీ ఫైనల్‌ చేసింది. తాజాగా మహారాష్ట్రలో కూడా రాజకీయాన్ని చూపించింది కమలం. గతంలో పొత్తుల విషయంలోనే శివసేనతో పొడసూపిన విబేధాలను మరిచి స్నేహబంధాన్ని అందుకుంది. పొత్తు కుదిర్చుకుంది. చేరి సగం సీట్లలో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే గత మూడేళ్లుగా బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించినా శివసేన, రామ మందిరం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. బీజేపీ, శివసేన పార్టీల పొత్తుతో మరో పార్టీ దూరమయ్యేలా కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధినేత రాందాస్ అథవాలే కేంద్రమంత్రి కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల మధ్య పొత్తులపై అథవాలే అసంతృప్తితో ఉన్నారు. దళితుల ఓట్ల కోసమయిన ఆర్పీఐకు కనీసం ఒక్క లోక్‌‌సభ సీటును కేటాయించాలంటున్నారాయన. మరి ఈ పరిణామం ఎటు వైపు మళ్లుతుందో చూడాలి.

రోజుకో రాష్ట్రంలో పొత్తులపై ప్రకటన చేస్తున్న బీజేపీ... తమిళనాడులో అన్నాడీఎంకే, పీఎంకేతో జత కట్టేసింది. కూటమిగా పోటీ చేయాలని ఆ మూడు పార్టీలు నిర్ణయించాయి. తమిళనాడులో అన్నాడీఏంకే, డీఎంకే పార్టీల తరువాత అతిపెద్ద పార్టీ అయిన పీఎంకే పార్టీతో చర్చలు జరిపిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం బీజేపీతోనే కలిసి పోటీ చేస్తామని, పుదుచ్చేరిలో కూడా ఇదే పొత్తు కొనసాగుతుందని సెల్వం తెలిపారు. ఇక- ఈశాన్య రాష్ట్రాల్లోని సంకీర్ణ ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటీకీ, పౌరసత్వ సవరణ బిల్లుతో పొత్తుకు ప్రాంతీయ పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ, అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ప్రధాన దృష్టి పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందే పార్టీలతో పొత్తు కుదుర్చుకునేందుకు పక్కా ప్రణాళికతో కమలం ముందుకు పోతున్నట్లు కన్పిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories