తక్కువ ఖర్చుతో మిద్దె తోట సాగు

Arun Chilukuri
Published on: 2 July 2019 7:11 PM IST
తక్కువ ఖర్చుతో మిద్దె తోట సాగు
X

అతి తక్కువ ఖర్చుతో కొద్ది పాటి స్థలంలో మిద్దె తోట సాగు చేస్తున్నారు హైదరాబాద్‌లోని నాచారం కు చెందిన శారద అనే మహిళ. నాచారం, అన్నపూర్ణ కాలనీకి చెందిన శారద గారికి మొక్కలంటే మమకారం ఎక్కువ. అందుకోసమే ప్రకృతి విధానంలో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు సరిపడే ఆకుకూరలను, కూరగాయలను తమ మేడ మీదనే పండిస్తున్నారు. మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటినీ పాలేకర్ సూచించిన ప్రకృతి ఎరువుల ద్వారానే అందిస్తున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు. అందరికీ ఆరోగ్యం అది ఇంటి నుండే సాధ్యం అని నిరూపిస్తున్నారు.

బియ్యం బ్యాగులు, వాడేసిన పెయింట్ డబ్బాలు, వాటర్ బాటిళ్లు, పాడైన బకెట్లు, ప్లాస్టిక్ సంచులు, గ్రోబ్యాగులలో మొక్కలు సాగుచేస్తున్నారు. అత తక్కువ ఖర్చుతో మిద్దెతోటలను నిర్వహిస్తున్నారు. విత్తనాలకు తప్ప మరేదానికి పెద్దగా ఖర్చు పెట్టడంలేదంటున్నారు శారద గారు. మిద్దె తోటలను సాగు చేయాలనుకునే వారు తొందరపడి అధికంగా ఖర్చు పెట్టి ఒకేసారి మొక్కలన్నింటిని పెంచడం కంటే మొదట తక్కువ ఖర్చుతో ఆకుకూరలతో సాగు ప్రారంభించి ఆ తరువాత మొక్కలపై అవగాహన పెంచుకుని నెమ్మదిగా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచిస్తున్నారు.

మేడ మీద ఉన్న అతి తక్కువ స్థలాన్ని సద్వినియోగ పరుచుకుంటున్నారు శారద . అతి తక్కువ ఖర్చుతో వివిధ రకాల కుండీలలో మొక్కలను పెంచుతున్నారు. తీగజాతి కూరగాయల సాగు కోసం పందిర్లను కూడా అతి తక్కువ ఖర్చుతో నిర్మించుకున్నారు. కుండీలలో స్థలం వృధా కాకుండా అంతర పంటలను సైతం సాగు చేస్తున్నారు. ప్రతీ మొక్కకు ప్రాణం పోస్తున్నారు. మేడ మీద నీటి లీకేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story